సెన్సార్ తీరు మరీ విడ్డూరం: 40 కట్స్, ఏం మిగులుతుంది చూడ్డానికి?
ముంబై: షాహిద్ కపూర్, అలియా భట్, కరీనాకపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం 'ఉడ్తా పంజాబ్'. అభిషేక్ చౌబే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. పంజాబ్లో తీవ్రమైన డ్రగ్స్ సమస్యను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 70 శాతం మంది పంజాబ్ యువత డ్రగ్స్ కు బానిసయ్యారు. ఇది ఇలానే కొనసాగితే పంజాబ్ మరో మెక్సికో అవుతుంది అనే కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇటీవల సెన్సార్ కు వెళ్లిన ఈ సినిమాకు పెద్ద షాకే తగిలింది. సినిమాలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా చూపారంటూ 40 సీన్లకు కత్తెర వేసింది బోర్డు. అయితే సినిమా ప్రధానాంశమే పంజాబ్ లో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిందని చెప్పడం, దాన్ని అరికట్టేందుకు ఒక సొల్యూషన్ చూపడం, యువతలో మార్పుతెచ్చేందుకు ప్రయత్నించడం. డ్రగ్స్ సంబంధ సినిమా అయినపుడు ఆ సీన్లు లేకుండా ఎలా సినిమా తీస్తాం, బోర్డు తీరు మరీ విడ్డూరంగా ఉంది అంటూ దర్శక నిర్మాతలు మండి పడుతున్నారు.

ఈ మేరకు దర్శక నిర్మాతలు ట్రిబ్యూనల్ ను, సమచార ప్రసార శాఖ అధికారులను కలిసేందుకు నిర్ణయించుకున్నారు. మరి అక్కడేమైనా న్యాయం జరుగుతుందా? ఈ నెల 17న విడుదలవుతున్న ఈ మూవీ పరిస్థితి ఏమిటి? అనేది తేలాల్సి ఉంది.
ఇటీవల విడుదలైన ఈచిత్రం ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. పంజాబ్లో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా, అక్రమ రవాణా లాంటి అంశాలను ఈ సినిమాలో ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఫాంటమ్ ఫిలింస్, బాలాజీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న రాక్ స్టార్ గా సాహిద్ కపూర్, బిహారీ శరణార్దురాలి పాత్రలో అలియా భట్, డాక్టర్ పాత్రలో కరీనా కపూర్, పోలీస్ అధికారి పాత్రలో దల్జిత్ దోసంజా ఈ ట్రైలర్ లో కనిపించారు.
ఉడ్తా పంజాబ్ కాదు... ఉడ్తా ఇండియా అనో, ఉడ్తా వరల్డ్ అనో పెట్టాలి
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా టైటిల్ మీద తనదైన శైలిలో స్పందించారు. డ్రగ్స్ సమస్య ఒక్క పంజాబ్ లో మాత్రమే కాదు, ఇండియాలోని చాలా ప్రాంతాల్లో, ప్రపంచం మొత్తం కనిపిస్తోంది. ఈ సినిమాకు ఉడ్తా పంజాబ్ కాదు, ఉడ్తా ఇండియా అనో, ఉడ్తా వరల్డ్ అనో పేరు పెట్టాలి అంటూ ట్వీట్ చేసారు.


Click it and Unblock the Notifications











