ఇకపై సినీ పరిశ్రమలో అలా ఉండదు.. బాహుబలి నిర్మాత విశ్లేషణ
కరోనా వైరస్ మానవాళి జీవితాన్ని, ఇంత వరకు పాటించిన పద్దతుల్ని మొత్తం మార్చేసింది. మనిషి జీవితంలోకి కొన్నింటిని తీసుకొచ్చింది. కరోనా భయంతో అందరూ శుభ్రతను పాటిస్తుననారు. సామాజిక దూరాన్ని పాటించేలా చేస్తోంది. విచ్చలవిడిగా స్వైర విహారం చేసేందుకు అనుమతిని ఇచ్చేలా లేదు. ఇంతకుముందులా భారీ భారీ ఫంక్షన్స్, ఈవెంట్స్, ర్యాలీలు ఇకభవిష్యత్తులో కనిపించకపోవచ్చు. ఇదంతా కరోనా నేర్పిన పాఠం. కరోనా వైరస్ చిత్రసీమపై పరోక్షంగా, ప్రత్యక్షంగా కోలుకోలేని దెబ్బను కొట్టింది.
ఇప్పటికే కరోనా మూలంగా దాదాపు రెండు నెలల కాలంలో కొన్ని వేల కోట్లను నష్టపోయింది భారతీయ చిత్ర పరిశ్రమ. రెండు నెలలుగా థియేటర్స్, షూటింగ్స్ లాంటి కార్యకలాపాలు ఏవీ జరగకపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న సడలింపుల్లో చిత్ర పరిశ్రమకు మాత్రం పనికి వచ్చేవీ ఏవీ లేవు. చూస్తూ ఉంటే ఇంకో రెండు మూడు నెలల వరకు ఎలాంటి పురోగతి కనిపించకపోవచ్చు.

ఈ క్రమంలోనే బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ చిత్రసీమ గురించి కొంత విశ్లేషించారు. కరోనా, లాక్డౌన్ తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చో ఊహించి చెప్పారు. కరోనా తర్వాత సినీ పరిశ్రమ గతంలో మాదిరి ఉండబోదని 'బాహుబలి' నిర్మాత శోభు చెప్పారు. ఆడియో లాంచ్ కార్యక్రమాలు, ప్రీరిలీజ్ ఫంక్షన్స్ వంటివి ఉండవని తెలిపారు. ప్రమోషన్ల కోసం రోడ్ ట్రిప్ లు, మాల్స్ కు వెళ్లడం, థియేటర్స్ కు వెళ్లడం వంటివి ఉండవని అన్నారు. అంతా ఆన్ లైన్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే జరుగుతుందని చెప్పారు. అయితే ఎంత పెద్ద సినిమా తీసినా.. అది సరైన మార్కెటింగ్ అవసరమని.. ఇకపై అది ఎలా చేయాలో ఎవరైనా చెప్పగలరా? అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











