స్మశానంలో షూటింగ్ ఇంకా మొదలు కాకముందే ఆగిపోయింది. దయ్యాలొచ్చి ఏమీ ఆపలేదు. షూటింగ్ యూనిట్టే సరైన పర్మిషన్ తీసుకోకుండా షూటింగ్ జరపడానికి సన్నద్ధమవుతుండడంతో స్థానికులు అడ్డుకున్నారు. పర్మిషన్ ఎవరిచ్చారని ప్రశ్నించారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాలీవుడ్ నటి నందితాదాస్ దర్శకత్వంలో గుజరాతీ, హిందీ భాషలలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఆ సన్నివేశాల చిత్రీకరణకోసం ఆ చిత్ర యూనిట్ సంతోష్ నగర్లోని బహ్రెన్ షా సమీపంలోని స్మశానంలో సోమవారం షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకున్నారు. లైటింగ్, క్రేన్ల ఏర్పాటు జరుగుతుండగా స్థానికులు కొందరు యూనిట్ వద్దకు వచ్చి ఎవరి అనుమతి తీసుకుని స్మశానంలో షూటింగ్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా యూనిట్ చేస్తున్న ఏర్పాట్లను అడ్డుకున్నారు. వక్ఫ్ బోర్డు అనుమతి తీసుకున్నామని యూనిట్ సభ్యులు సమాధానమివ్వగా వాటిని చూపండని స్థానికులు డిమాండ్ చేశారు. అనుమతి పత్రాలు తమ వద్దలేవని యూనిట్ సభ్యులు అనడంతో ఎంఐఎం, ఎంబిటీ నాయకులు రంగంలోకి దిగి ఆందోళన ప్రారంభించారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈలోపు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి యూనిట్ సభ్యులను అనుమతి పత్రాలను చూపాలంటూ అడిగారు. దీంతో పాలుపోని యూనిట్ సభ్యులు ముంబైలో ఉన్న తమ ప్రొడక్షన్ ఇంచార్జ్ ప్రదీప్ కుమార్ తో మాట్లాడించారు. వక్ఫ్ బోర్డు అనుమతి వచ్చిందని, కొద్ది గంటల్లో అనుమతి పత్రాలను అందజేస్తామని ఆయన సమాధానమిచ్చారు. అప్పటివరకూ షూటింగ్ను ఆపివేయాల్సిందేనని పోలీసులు ఆదేశించడంతో యూనిట్ సభ్యులు వెనుదిరిగారు.