ఏడవ తేదినుంచి షూటింగ్ లు ఆపివేత
కొద్ది నెలల క్రిందట పరిశ్రమ స్ట్రైక్ తో షూటింగ్ లు చాలా వరకూ ఆగి పోయి ఆ ఎఫెక్టు ఇప్పటివరకూ కొడుతోంది. అయితే ఏడవతేది నుంచి మళ్ళీ అదే పరిస్దితి తెలుగు సినిమాకు ఎదురుకానుంది. ఈ మేరకు దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు సి.కల్యాణ్ ఓ ప్రకటన చేసారు. ఆయన మాట్లాడుతూ...''చలనచిత్ర కార్మికుల జీతభత్యాలను 30 శాతం వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ సమాఖ్య 50 నుంచి 100 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేస్తోంది. కర్ణాటకలో 10 నుంచి 28 శాతం వరకు జీతాలు పెంచేందుకు కార్మికుల సంఘానికీ, నిర్మాతల మండలికి మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఇక్కడ 30 శాతం వరకు ఇస్తామన్నా ఒప్పుకోవడం లేదు.
దీనిపై నిర్మాతలందరూ మూడు రోజుల పాటు క్షుణ్నంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాం. ఈ నెల ఏడో తేదీ నుంచి కొత్త చిత్రాల ప్రారంభానికి అనుమతిని నిరాకరించాం. నటీనటుల సంఘంతోపాటు అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమైంది. అలాగే ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాలు అక్టోబరు 31వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలి. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని అన్నారు. ఆయన సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. అలాగే తాము ఎంత వెసులుబాటు కల్పించినా సమాఖ్య దిగిరావడం లేదన్నారు. వేతనాలను ముప్ఫై శాతం మేరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నా చలన చిత్ర కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) మరింత డిమాండ్ చేస్తోందన్నారు.


Click it and Unblock the Notifications











