మాజీ ప్రియుడితో నయనతార మళ్లీ! విషయం లీక్ చేసిన దర్శకుడు
చెన్నై: తమిళ హీరో శింబు, నయనతార మధ్య అప్పట్లో ఎంత ఘాటు ప్రేమాయణం సాగిందో ఇపుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై రొమాన్స్ పండించడంతో పాటు...తెర వెనక రియల్ లైఫ్లో వీరి మధ్య సరసాలు సాగాయి. అప్పట్లో వీరి రహస్య రాసలీలకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో లీకై పెను సంచలనమే సృష్టించాయి.
ఏవో కారణాలతో ఆ తర్వాత నయనతార శింబుతో విడిపోవడం, కొంత కాలం తర్వాత ప్రభుదేవాతో డేటింగ్ చేయడం, ప్రభు-నయన వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి ఫెయిలైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరుతోనూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన నయన వారితో ఇమడలేక విడిపోయింది. ఈ క్రమంలో కొంత కాలం సినిమాలకు దూరమైన ఆమె....ఆ పరిస్థితి నుంచి తేరుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడంతో పాటు వరుస హిట్లతో టాప్ రేంజిని అందుకుంది.
కాగా...నయనతార, శింబులకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత నయనతార-శింబు కలిసి నటిస్తున్నారు. తమిళంలో తెరకెక్కుతున్న చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయినట్లు దర్శకుడు వెల్లడించారు.
గతంలో నయనతార-శింబు కలిసి నటించిన వల్లభన్(తెలుగులో 'వల్లభ') చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ హాట్ జోడీ తాజాగా మళ్లీ జతకడుతుండంతో వారి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలోనూ వీరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా దర్శకుడు ప్లాన్ చేసాడు.


Click it and Unblock the Notifications












