భానుతో లింక్స్ లేవు, వైజయంతిరెడ్డి భర్తే బెదిరించారు: శింగనమల
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్తో తనకు సంబంధాలు లేవని తెలుగు సినీ నిర్మాత శింగనమల రమేష్ స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలింపు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన గురువారం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు. భానుతో తనకు సంబంధాలున్నట్లు తనపై ఆరోపణలు రావడం తన ఖర్మ అని, భానుకు బినామీగా తాను వ్యవహరించలేదని ఆయన అన్నారు. సూరి హత్యకు రెండు మూడు రోజుల ముందు భాను తనతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తనకు పారిపోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. విచారణ కోసం రావాలని పోలీసులు తనకు మూడు సార్లు ఫోన్ చేశారని, అయితే అత్యవసర పనుల వల్ల తాను వెళ్లలేకపోయానని, పోలీసులు తనతో చాలా మర్యాదగా ప్రవర్తించారని ఆయన చెప్పారు. ఎవరి డబ్బులతోనో వ్యాపారం చేయాల్సిన కర్మ తనకు పట్టలేదని ఆయన అన్నారు. 60, 70 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అమ్ముకుని తన సినిమాలను విడుదల చేయించుకున్నానని ఆయన చెప్పారు. భాను దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన కర్మ తనకు పట్టలేదని ఆయన చెప్పారు.
తనను బెదిరించాడంటూ వైజయంతి రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. వైజయంతిరెడ్డి పేరు సినీ రంగంలో ఎవరికీ తెలియదని ఆయన చెప్పారు. తనపై ఫిర్యాదు చేసిన తర్వాత తొలిసారి తాను వైజయంతి రెడ్డి పేరు విన్నట్లు ఆయన తెలిపారు. వైజయంతి రెడ్డితో ఒక్క రూపాయి లావాదేవీ కూడా జరగలేదని ఆయన చెప్పారు. వైజయంతి రెడ్డి భర్త సదానందతో తనకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం ఉన్న మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. సదానందనే తనకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడని ఆయన చెప్పారు. తనను, తన కుటుంబ సభ్యులను చంపుతామని అనంతపురం, కడప రౌడీలు తనను, తన కుటుంబ సభ్యులను మూడు నెలలుగా బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. తనకు చట్టం, న్యాయం, ధర్మం మీద నమ్మకం ఉందని ఆయన అన్నారు. భాను పట్టుబడితే తాను సంతోషిస్తానని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











