గిన్నిస్ బుక్ లో పి. సుశీల, ఎన్ని పాటలు పాడారామె?
హైదరాబాద్ :ప్రముఖ గాయని పి.సుశీలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. అత్యధిక సంఖ్యలో సోలో పాటలు పాడినందుకు ఆమెకీ స్థానం లభించింది.
''2016 జనవరి 28 నాటికి ధ్రువీ కరించిన సమాచారం ప్రకారం పులపాక సుశీలా మోహన్ (జననం 1935 - ఇండియా) 1960ల నుంచి 6కు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలు రికార్డ్ చేశారు'' అని గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు పేర్కొన్నారు.
1952లో తమిళ చిత్రం 'పెట్రతాయి' (తెలుగులో 'కన్నతల్లి') ద్వారా సినీ సీమకు గాయనిగా పరిచయమైన ఆమె ఇప్పటి దాకా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో సినీ, ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు 40 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా.

ఈ సందర్బంగా గాయని పి. సుశీలను మీడియాతో మాట్లాడుతూ..''ఏం చెప్పాలో తెలీడం లేదు. మాటలు పెగలడం లేదు. అంతా ఇప్పటికీ కలలా అనిపిస్తోంది. ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. ఈ గొంతు నాకు భగవంతుడు ప్రసాదించిన వరంగా భావిస్తాను.
బంగారం లాంటి శ్రోతలను, అభిమానులను ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు. నాకెప్పుడూ రికార్డుల గురించి తెలీదు, వాటి గురించి పట్టించుకున్నదీ లేదు. ఇంకా చెప్పాలంటే నేనెన్ని పాటలు పాడానో నాకే తెలీదు.
పాడిన పాటలన్నీ ఒక చోట రాసుకోవడం, వాటిని సేకరించుకోవడం అనేది అసలు తెలీదు. సంగీత దర్శకులు, అభిమానుల ఆదరణతో అలా సాగిపోయాను. ఇప్పుడు కూడా నా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది అంటే కారణం నా గొప్ప కానేకాదు.
నా అభిమానుల గొప్పే. నా పాటలంటే అభిమానించే ఏడుగురు అభిమానులు అవిశ్రాంతంగా చేసిన కృషికి ఫలితవమే ఈ రికార్డు. ఇందుకు వారికి కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











