గాయని రాధిక మృతి: "బావలు సయ్యా" పాటతో పేరుతెచ్చుకున్న గాయని
"బావలు సయ్యా.. హే మరదలు సయ్యా..." ఆ ఒక్క పాట తోనే తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయని రాధిక హఠాన్మరణం చెందారు.
"బావలు సయ్యా.. హే మరదలు సయ్యా..." తెలుగు ఐటం సాంగ్స్ లో ఒక ప్రత్యేక స్ఠానం ఉన్న ఈ పాట వినిపించగానే మరణించిన అందం సిల్క్ స్మిత గుర్తొస్తుంది. అయితే ఆపాటని పాడిన గాయని రాధిక మాత్రం టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు. ఆఒక్క పాట తోనే తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయని రాధిక హఠాన్మరణం చెందారు.
ఎన్నో జనరంజకమైన పాటలను పాడిన ఆమె 47 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అకాలమరణం పొందారు. ఆమె స్వస్థలం తిరుపతి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో 200కు పైగా పాటలు పాడారు. 2004 నుంచి సినిమా రంగానికి దూరంగా ఉంటున్న ఆమె చెన్నై పాలవాక్కంలో భర్త, పిల్లలతో కలిసి ఉంటున్నారు.

శుక్రవారం ఉదయం 6.30గంటల సమయంలో గుండెపోటుకు గురైన రాధిక తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై సంగీత దర్శకులు కోటి, మణిశర్మ, గాయకులు మనో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పాలవాక్కం శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భర్త శశికుమార్ తెలిపారు.


Click it and Unblock the Notifications











