భారత రత్న కావాలి...ఈ పద్మ భూషణ్ వద్దు : ఎస్. జానకి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ప్రకటించే పద్మ అవార్డులను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు, ప్రముఖ గాయని ఎస్. జానకికి పద్మ భూషణ్, దర్శకుడు బాపు, నటి శ్రీదేవికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
అయితే గాయని ఎస్. జానకి మాత్రం ఈ అవార్డు తనకు వద్దంటూ తిరస్కరించారు. నిన్న ఆమె మీడియాతో స్పందిస్తూ ఇన్నేళ్ల తర్వాత ఈ అవార్డు వచ్చి ఏం లాభం, ఇంత లేటుగా నన్ను గుర్తించినందుకు బాధగా ఉంది...తనకు ఏం మాత్రం సంతృప్తి లేదని, పద్మ భూషణ్ కంటే పెద్ద అవార్డు ఆశించాను, ఉత్తరాది వారి మాదిరి దక్షిణాది వారికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె అన్నారు. భారత రత్న అవార్డు తప్ప అంతకు తక్కువ స్థాయి అవార్డు తనకు అక్కర లేదని ఆమె మీడియా వద్ద ఘాటుగా స్పందించారు. తనకు ఈ అవార్డు కంటే గొప్ప స్థానం అభిమానుల గుండెల్లోనే ఉందని, అది చాలన్నారు.
దక్షిణాది వారికి అన్యాయం జరుగుతోందని ఒక జానకి మాత్రమే కాదు, దక్షిణాదిలో చాలా మంది కళాకారులు, కళాభిమానులు చాలా కాలం నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందునా తెలుగు వారి పరిస్థితి అయితే మరీ దారుణం. 2004 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 233 నామినేషన్లు పంపగా కేవలం 30 మందికి మాత్రమే అవార్డులు దక్కాయి.
పద్మ పురస్కారాలు ప్రతిభను బట్టి ఇచ్చే సంస్కృతి చాలా కాలం క్రితమే మటుమాయం అయిందని....బాగా పలుకుబడి ఉండి రాజకీయ నాయకులకు సన్నిహితంగా ఉండే వారికే అవార్డులు దక్కుతున్నాయనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. మొత్తానికే ఇవ్వకుంటే బాగుండదను కాబట్టి ప్రతి సంవత్సరం ఒకటి అరా మన రాష్ట్రానికి విదుల్చుతున్నారు. భజన పరులైన మన రాజకీయ నాయకులకు ఇలాంటి విషయాలు పట్టించుకునే తీరికెక్కడిది?


Click it and Unblock the Notifications











