కాలు నేలకేసి కొడితే భూకంపం, విజిల్ వేస్తె ట్రైన్ రావడం.. విసిగిపోయాం.. ఇప్పుడు అంతరిక్షంలోకి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం అంతరిక్షం. ఘాజి లాంటి అద్భుత చిత్రాన్ని అందించిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. స్పేస్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అంతరిక్షంలో జరిగే ఉత్కంఠ భరిత సన్నివేశాలని అబ్బురపరిచే విజువల్స్ లో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేసింది. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలవుతున్ననేపథ్యంలో నేడు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ప్రీరిలీజ్ ఈవెంట్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రసంగించారు.

మిలియన్ డాలర్ల ప్రశ్న
ప్రేక్షకుడి అభిరుచి మారింది కాబట్టి కొత్త సినిమాలు వస్తున్నాయా లేక కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి ప్రేక్షకుడి అభిరుచి మారిందా అనేది చెట్టు ముందా విత్తు ముందా తరహాలో మిలియన్ డాలర్ల ప్రశ్న అని సిరివెన్నెల అన్నారు. తెలుగు సినిమా గమనాన్ని కొత్త ట్రెండులోకి తీసుకుని వెళ్లే విధంగా సంకల్ప్ రెడ్డి చిత్రాలు చేస్తున్నాడని సిరివెన్నెల ప్రశంసించారు.

క్రిష్ని కూడా అభినందించాలి
కొత్త ట్రెండులో ప్రస్తుతం తెలుగు చిత్రాలు వస్తున్నాయి. అలాంటి ప్రయత్నం చేస్తున్న క్రిష్ ని కూడా అభినందించాలి అని సిరివెన్నెల అన్నారు. గమ్యం, కంచె చిత్రాలు అందుకు ఉదాహరణ అని సిరివెన్నెల అన్నారు. అంతరిక్షం చిత్రానికి నిర్మాతగా మారి కొత్త తరహా చిత్రాలు చేసే వారిని క్రిష్ ప్రోత్సహిస్తున్నాడు.
విజిల్ వేస్తె ట్రైన్ రావడం
గట్టిగ కాలు నేలకేసి కొడితే భూకంపం రావడం.. విజిల్ కొడితే ట్రైన్ రావడం తరహా చిత్రాలు చూసి విసిగిపోయాం అని అన్నారు. భయంకరమైన హింసతో కూడుకున్న ఫైట్స్ కూడా ఇప్పుడు కామెడీ అయిపోయాయి. ఇలాంటి విచిత్రాలని చూసిన తెలుగు ప్రేక్షకులలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందని సిరివెన్నెల అన్నారు.

కొత్తగా ఏమైనా చేద్దాం
ఇలాంటి చిత్రాల నుంచి తెలుగు ప్రేక్షకులు బయటపడుతున్న తరుణంలో మనం కూడా ఏదైనా కొత్తగా చేద్దాం అని దర్శకుడు సంకల్ప్ రెడ్డి సంకల్పించుకున్నాడు. సముద్రంలోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు అంతరిక్షంలోకి విజయవంతంగా తీసుకెళ్ళబోతున్నాడు. అందుకు అతడికి అభినందనలు అని సిరివెన్నెల తెలిపారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు.


Click it and Unblock the Notifications











