‘మా’ ఎన్నికలు పూర్తి, రిజల్ట్స్ ఇవిగో, అంతా ఏకగ్రీవమే
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా నటుడు శివాజీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హైదరాబాద్: గత సంవత్సరం జరిగిన 'మా' ఎన్నికలు అందరికీ గుర్తుండే ఉండి ఉంటాయి. ఆ ఎన్నికలు చాలా వాదాలు, వివాదాలతో ఓ యుద్దాన్ని తలపిస్తూ సాగింది. సినీ నటుడు రాజేంద్రప్రసాద్ వర్సెస్ జయసుధలు పోటీకి దిగటం.. సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోవటం జరిగింది. విమర్శలు,ప్రతి విమర్శలతో .. హోరాహోరీ ప్రకటనల నడుమ ఎన్నిక జరిగింది. అయితే చిత్రంగా ఈసారి అందుకు భిన్నంగా ఏకగ్రీవ నిర్ణయంతో ఎన్నికలు సాగటం విశేషం.

ఈ సారి జరిగిన ఎన్నికలో....లో ఇంతకాలం 'మా'కు ప్రధానకార్యదర్శిగా ఉన్న శివాజీరాజా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. నిన్న నిర్వహించిన 'మా' ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇక.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హీరో శ్రీకాంత్.. ఉపాధ్యక్షుడిగా కమేడియన్ వేణు మాధవ్..బెనర్జీలు.. ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరేశ్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.
ఎన్నిక అనంతరం నూతన అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ... 750 మంది సభ్యుల నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. ప్రస్తుతం 30 మంది కళాకారులకు ఇస్తున్న పింఛనను 25 శాతం పెంచి ఇస్తామని తెలిపారు. 'మా' 25 ఏళ్ల ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తామన్నారు.

నరేష్ మాట్లాడుతూ...తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు అయిన దాసరి చేసిన కృషి కారణంగానే ఈసారి పోటీ లేకుండానే ఏకగ్రీవంగా కొత్త కమిటీని ఎన్నుకున్నట్లుగా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











