వివాదం ముగిసి...ఒకే స్టేజీపై
హైదరాబాద్ : హీరో శివాజీ తనను అన్యాయం చేసాడంటూ మీడియాకు ఎక్కిన దర్శకుడు రేవన్ యాదవ్, శివాజీ ఇద్దరూ ఒకటయ్యారు. ఇద్దరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. తనను తప్పుగా అర్దం చేసుకున్నాడంటూ శివాజీ చెప్పారు. తను ఎవరి ప్రతిభను తొక్కనంటూ...తొక్కలేదంటూ చెప్పుకొచ్చారు. రేవన్ యాదు విజన్ ఉన్న దర్శకుడు. నేనేదో అతనికి అన్యాయం చేస్తున్నానని తొందరపడి మాటలనేశాడంతే అని అన్నారు. శివాజీ హీరోగా నటించిన 'బూచమ్మ బూచోడు'ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా యూనిట్ హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటుచేసింది.
శివాజీ మాట్లాడుతూ ‘‘ఏ ఒక్కరినీ అణచివేయాలనే ఆలోచన నాకుండదు. నా వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసు. ఆ విషయాన్ని రేవన్ కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాడు. దర్శకుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రచారం విషయంలో తనను పక్కన పెట్టామని మా దర్శకుడు రేవన్ యాదూ కాస్త కలత చెందారు. ప్రతిభ ఉన్నవాడికి ప్రచారం అవసరం లేదు. ఏ ఒక్కరి వృద్ధిని ఎవరూ ఆపలేరు. ప్రతిభను పరిశ్రమ గుర్తిస్తుంది. అవకాశాలిప్పిస్తుంది. దీన్ని అందరూ గుర్తుంచుకోవాలి'' అని అన్నారు.

అలాగే... '' సరైన సినిమాలు లేకపోవడంతో నటుడిగా ఇదే నా చివరి సినిమా అనుకున్నాను. నిర్మాతలు సినిమా భారాన్ని మొత్తం నాపై ఉంచారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సినిమా పూర్తి చేసి హిట్ చేశాం. ఈ సినిమా విజయం సాధించకపోతే సినిమా రంగం నుంచి తప్పుకుందామనుకున్నాను. ప్రేక్షకులకు మా సినిమా నచ్చింది. దీంతో మరిన్ని సినిమాలు చేసే ఉత్సాహమొచ్చింది'' అన్నారు శివాజీ మాట్లాడుతూ.
నిర్మాత మాట్లాడుతూ... ‘‘చిత్ర పరిశ్రమకు మేము కొత్త. నిర్మాణపరమైన బాధ్యతలన్నీ శివాజీ మీద పెట్టాం. రేవన్ చక్కని అవుట్పుట్ ఇచ్చారు. ఫైనల్గా మా సినిమా ప్రేక్షకాదరణ పొందింది'' అని నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్రెడ్డి అన్నారు. సినిమా విజయంపై దర్శకుడు రేవన్ యాదు, సంగీత దర్శకుడు శేఖర్చంద్ర, రచయిత సాయికృష్ణ ఆనందం వ్యక్తం చేశారు.
స్నేహ మీడియా, హెజన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘బూచమ్మ బూచోడు'. రేవన్ యాదు దర్శకుడు. ఇటీవల విడుదలైందీ చిత్రం.


Click it and Unblock the Notifications











