పోలీసుల సాయంతో అన్నదానం.. సింగర్ స్మిత పెద్ద మనసు
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మానవాళిని వణికిస్తోంది. విరుగుడు లేని ఈ వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల కరోనా కేసులు నమోదు కాగా అందులో రెండు లక్షలకుపైగా మృతి చెందారు. ఇంతలా విజృంభిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు ప్రపంచదేశాలు లాక్ డౌన్ను అమలు చేస్తున్నాయి. మన దేశంలోనూ గత నెలరోజుల నుంచి లాక్ డౌన్ అమల్లోనే ఉంది. దీనివల్ల ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. ఇంకెంతో మంది తినడానికి తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు.
అలాంటి వారిని ఆదుకునేందుకు సెలెబ్రిటీలు, స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇలాంటి ఆపత్కాల సమయంలో సెలెబ్రిలందరూ తమవంతుగా ముందుకు వచ్చి పేదవారి ఆకలిని తీర్చుతున్నారు. ఇప్పటికే గోపీచంద్, ప్రణీత వంటి వారు పేదవారికి ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. తమకు చేతనైన సాయాన్ని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

తాజాగా సింగర్ స్మిత చేస్తోన్న సాయం గురించి బయటకు వచ్చింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. సజ్జనార్ సర్ను కలవడం, ఆయన బృందంతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. గత నెల రోజులుగా పోలీసు బృందంతో కలిసి ఇప్పటి వరకు 82360 ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసినట్టుగా పేర్కొంది. మీ సలహా మేరకు ఇప్పుడు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తానని తెలిపింది. ఇలాంటి విపత్కర సమయంలో తన వంతుగా చేతనైన సాయాన్ని చేస్తానని పేర్కొంది.


Click it and Unblock the Notifications











