'దూకుడు'తో వస్తున్న మహేష్ బాబు బావ
మహేష్ చిత్రం దూకుడు రేపు ప్రపంచమంతటా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలతో పాటు మహేష్ బావ అయిన పోసాని సుధీర్ చిత్రం 'శివ మనసులో శృతి' ప్రోమోలు కూడా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. దూకుడు చూడటానికి ఎక్కడెక్కడ జనం వస్తారుకాబట్టి ఆ రకంగా సుధీర్ సినిమా ప్రమోషన్ కూడా జరిగిపోతుందని భావిస్తున్నారు. సుధీర్ బాబు కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని భర్త.అతను మొదట చేసిన చిత్రం 'ఏమాయ చేసావె'. అందులో సమంత అన్నగా చేసాడు.అతను హీరోగా ఇప్పుడు 'శివ మనసులో శృతి' అనే సినిమా తయారవుతోంది. తమిళ చిత్రం ఎస్.ఎమ్.ఎస్ కి ఇది రీమేక్. 'భీమిలి కబడ్డిజట్టు' ఫేం తాతినేని సత్య ఈ సినిమాకి డైరెక్టర్.
'శివ మనసులో శృతి' సినిమాని ఆర్.బి. చౌదరి సమర్పిస్తుండగా, హనీబీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై కృష్ణ కుమార్తె ఘట్టమనేని ప్రియ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ సరసన నాయికగా రెజీనా పరిచయమవుతోంది. సెల్వ గణేశ్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఈ చిత్రం తమిళంలో బాగా ఆడటంతో ఈ సినిమాపై నమ్మకం పెంచుకున్నారు. సత్య తీసిన 'భీమిలి కబడ్డిజట్టు' చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయినా మంచి దర్శకుడుగా పేరు తెచ్చిపెట్టడంతో ఈ ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఆడితే మిగతా హీరోల బావలు,అల్లుళ్ళు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











