దంబంగ్3 కలెక్షన్ల కంటే దేశమే ముఖ్యం.. సల్మాన్కు సోనాక్షి షాక్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ 3 చిత్రం విజయం వైపు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఊహించినట్టే ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ సాధించడంపై అందాల తార సోనాక్షి సిన్హా సంతోషాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్ 20న రిలీజైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఈ క్రమంలో సినిమా కంటే తనకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఆమె వ్యాఖ్యలు చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళితే..

ప్రజలకు ఏం కావాలో వారికి తెలుసు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంపై సోనాక్షి స్పందిస్తూ.. దేశ ప్రజలకు తమకు ఏం కావాలో వారికి స్పష్టంగా తెలుసు. ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. సీఏఏపై దేశం మొత్తం ఏకమైంది. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సినిమా కంటే ప్రజలకు దేశ ప్రయోజనాలే ముఖ్యం అని సోనాక్షి అన్నారు.

ప్రజా ఆందోళనలకు మద్దతు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా ఆందోళనలకు తన మద్దతు ఉంది. ప్రజలంతా ఓ అంశపై ఏకమై ఉద్యమించడం గర్వంగా ఉంది. అగ్ర నటులు ఈ నిరసనలు, ఆందోళనలపై స్పందించకపోవడం వారి వ్యక్తిగత అభిప్రాయంగా భావించాల్సి ఉంటుంది అని సోనాక్షి పేర్కొన్నది.

5 రోజుల్లో 92 కోట్లు
ఇక దంబంగ్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. గతవారం రోజుల్లో ఈ చిత్రం రూ.100 కోట్లకు వసూళ్లకు చేరువైంది. శుక్రవారం ఈ చిత్రం రూ.24.5 కోట్లు, శనివారం రూ.24.75 కోట్లు, ఆదివారం రూ.31.90 కోట్లు, సోమవారం రూ.10.70 కోట్లతో మొత్తంగా రూ.92 కోట్లు వసూలు చేసింది. అయితే దంబంగ్ సినిమా కంటే సీఏఏకు వ్యతిరేకంగా ప్రజా ఆందోళన ముఖ్యం అనడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని వర్గాలు ఆమె వ్యాఖ్యలను తప్పు పడుతున్నట్టు తెలుస్తున్నది.

పౌరసత్వ చట్టం అంటే ఏమిటి?
పౌరసత్వ సవరణ చట్టం అంటే.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ నుంచి భారత దేశానికి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీ, క్రిస్టియన్ కమ్యూనిటీలు, మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చే వెసలుబాటును ఈ చట్టం చేస్తుంది. డిసెంబర్ 31, 2014 వరకు వచ్చిన శరణార్థులు, కాందీశీకులకే ఈ చట్టం వర్తిస్తుంది. ముస్లింలకు చోటు కల్పించకపోవడం వివాదంగా మారింది.


Click it and Unblock the Notifications











