నట సౌందర్యం... సౌందర్య జయంతి నేడు
అందానికి అందం.. అభినయానికి.. అభినయం ఆమె సొంతం. సావిత్రికి రీ ప్లేస్మెంట్ ఎవరంటే ఆమె పేరు తప్ప మరెవరి పేరు వినిపించదు. ఒక రకంగా ఆమె తెలుగు సినీ పరిశ్రమకు దొరికిన ఒక గిఫ్ట్. ఆవిడే హీరోయిన్ సౌందర్య. నేడు సౌందర్య జయంతి. ఎన్నో సినిమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సౌందర్య, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. చూడ్డానికి క్యూట్గా కనిపించే ఈ నటి, ఏనాడూ ఎక్స్పోజింగ్ జోలికి పోలేదు. నటనతోనే గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అద్భుతమైన అభినయంతో నటిస్తూ... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందింది.
సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. కన్నడ రచయిత, నిర్మాత కె.ఎస్. సత్యనారాయణ కూతురైన సౌందర్య ప్రాథమిక విద్యను అభ్యసించుచున్నప్పుడే మొదటి చిత్రంలో నటించింది. ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి స్నేహితుడు 1992లో 'గంధర్వ' అనే చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. .రైతుభారతం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సౌందర్య అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది. విక్టరీ వెంకటేశ్తో కలిసి పవిత్ర బంధం సినిమాలో నటించిన సౌందర్య, మంచి పేరు తెచ్చుకుంది. రజనీకాంత్ సరసన నరసింహ మూవీలోనూ అద్భుతంగా యాక్ట్ చేసింది. చూడాలని ఉంది సినిమాలో చిరు పక్కన అమాయకత్వం కలబోసిన అమ్మాయిగా నటించింది.ఇక సౌందర్య మాత్రమే చేయగల సినిమాలు చాలానే ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు, పవిత్రబంధం, అంత:పురం చిత్రాల్లో నటనకుగాను సౌందర్య అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు "సౌందర్య".
అయితే దురదృష్ణ వశాత్తు సౌందర్యం జీవితం మధ్యలోనే ఓ ప్రమాదంలో ముగిసి పోయింది. ఏప్రిల్ 17, 2004న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఎన్నికల సందర్భంగా, భారతీయ జనతా పార్టీ తరుపున ప్రచారానికి బయల్దేరగా ఈ ప్రమాదం సంభవించింది. ఆమె అన్న, కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్ నాధ్ కూడా ఆ ప్రమాదంలో మరణించారు. ఆమె జ్ఞాపకార్ధం "సౌందర్య స్మారక పురస్కారం"ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరించుచున్నారు.


Click it and Unblock the Notifications











