విషాదంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. తల్లి మరణంతో హుటాహుటిన..
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి శకుంతలమ్మ సోమవారం స్వస్థలమైన నెల్లూరులో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. గత కొద్దికాలంగా శకుంతలమ్మ వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

తల్లి మరణవార్తతో భారత్కు
తల్లి శకుంతలమ్మ మరణవార్త తెలిసే సమయానికి బాలు లండన్లో ఉన్నారు. సంగీత కచేరి కోసం లండన్లో పర్యటిస్తున్నారు. తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఆయన నెల్లూరుకు ప్రయాణమయ్యారని తెలిసింది. సోమవారం సాయంత్రాని కల్లా నెల్లూరుకు చేరుకొనే అవకాశం ఉంది.

నెల్లూరులో అంత్యక్రియలు
సంగీత దిగ్గజం బాల సుబ్రహ్మణ్యం నెల్లూరుకు చేరుకొన్న అనంతరం మంగళవారం శకుంతలమ్మ అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు పేర్కొన్నారు. బాలు తల్లితో విడదీయలని అనుబంధం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.

దక్షిణాది సినీ వర్గాల దిగ్భ్రాంతి
గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తల్లి మరణవార్తతో సన్నిహితులు, స్నేహితులు, దక్షిణాది సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషాదంలో కూరుకుపోయిన బాలుకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేసి ఫోన్లో పరామర్శించినట్టు సమాచారం.

శకుంతలమ్మ అంత్యక్రియలకు ప్రముఖులు
మంగళవారం జరిగే శకుంతలమ్మ అంత్యక్రియలకు పలువురు తమిళ, తెలుగు సినీ ప్రముఖులు హాజరవుతున్నట్టు తెలిసింది. శకుంతలమ్మ మరణంతో నెల్లూరు పట్టణ ప్రజలు విషాదంలోకి కూరుకుపోయారు. స్థానిక రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఆమె పార్థీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.


Click it and Unblock the Notifications











