ఎస్పీ బాలు లేరనే బాధ ముఖ్యమా? బిల్లుల చెల్లింపులా? ఘాటుగా స్పందించిన ఎస్పీ చరణ్
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అనారోగ్యంతో బాధపడుతూ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో అయిన బిల్లుపై అనేక ఊహాగానాలు మీడియా, సోషల్ మీడియాలో రావడం వివాదంగా మారింది. ఈ వార్తలు ఎస్పీ బాలు కుటుంబానికి, అభిమానులకు తీవ్ర మనస్తాపం కలిగించాయి. ఈ వార్తలు తమ పరిధిని దాటి వెళ్తున్నాయనే విషయాన్ని గ్రహించిన ఎస్పీ బాలు కుటుంబం క్లారిటీ ఇచ్చింది. చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ చరణ్ మాట్లాడుతూ..

కరోనా బారిన పడటం అప్రస్తుతం
ఎస్పీ బాలసుబ్రమణ్యం హైదరాబాద్లో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొనడం ద్వారానే కరోనా బారిన పడ్డారనే వార్త ఇప్పుడు అప్రస్తుతం. ఆయన కచెరీకి వెళ్లారా? షూటింగుకు వెళ్లారా అనే విషయాన్ని పక్కన పెడితే.. మా కుటుంబానికి జరిగిన నష్టం బాధగా ఉంది. సంగీత ప్రపంచానికి జరిగిన లోటుతో వాళ్లంతా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన మరణానికి కారణాలు అన్వేషించడం సరికాదు అని ఎస్పీ చరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

భారీగా స్మారక స్తూపం నిర్మిస్తాం
ఇక తమరైపాకంలో నాన్నగారి పేరిట భారీగా స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇంకా పూర్తిస్థాయి కార్యచరణ రూపొందలేదు. ప్రభుత్వ అనుమతులు కావాల్సి ఉంటుంది. ఇంకా నాన్న గారు పోయారనే బాధలోనే ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ మధ్య ఇంకా అలాంటి చర్చలు రాలేదు. త్వరలోనే అన్ని వివరాలు మీకు చేరుతాయి అని ఎస్పీ చరణ్ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఎస్పీ బాలు లేరనే బాధ ముఖ్యమా? బిల్లులా?
ఇక హాస్పిటల్ బిల్లుల గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఎస్పీ బాలు సహనం కోల్పోయారు. ఎస్పీ బాలు మరణం విషయం ముఖ్యమా? ఆయన చికిత్సకు అయిన హాస్పిటల్ బిల్లులు ముఖ్యమా? ఇలాంటి పరిస్థితుల్లో ఇలా వ్యవహరించడం సరికాదు. బిల్లుల చెల్లింపు విషయం మాకు, హాస్పిటల్కు సంబంధించిన వ్యకిగత విషయం. బిల్లు ఎంత కట్టాలి? ఎలా కట్టాలన్నది మాకు సంబంధించిన విషయం. బిల్లు ఎంతైనా కట్టాల్సింది మేము. దానికి సంబంధించిన విషయంలో గోప్యత పాటిస్తాం అని ఎస్పీ చరణ్ వెల్లడించారు

బిల్లులు ఎంతనేది చెప్పనవసరం లేదు
ఎస్పీ బాల గారిని కాపాడుకోలేకపోయామనే బాధ మాకు, హాస్పిటల్ వర్గాలకు ఉంది. హాస్పిటల్ బిల్లుల విషయం కాన్ఫిడెన్షియల్. మాకు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ వర్గాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలపై వివాదాలు సృష్టించకండి. ఊహజనిత వార్తలతో మమల్ని బాధపెట్టకండి అంటూ ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.
Recommended Video

మా సంబంధాలను చెడగొట్టొద్దు
నాన్న గారి బిల్లుల వివాదంలోకి ఉప రాష్ట్రపతి కుటుంబాన్ని లాగడం బాధకలిగించింది. వారికి, మాకు ఉన్న అనుబంధం గొప్పది. అలాంటి సంబంధాన్ని మీ కల్పిత రాతలతో చెడగొట్టకండి. ఈ బిల్లుల వివాదాన్ని ఇక్కడితో ఆపేయండి. నాన్న ఆత్మకు శాంతి చేకూరేలా ప్రార్థిద్దాం. అదే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అంటూ ఎస్పీ చరణ్ వేడుకొన్నారు.


Click it and Unblock the Notifications











