'బాహుబలి' : స్పెయిన్లో స్పెషల్ షో
హైదరాబాద్: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వసూళ్లు సాధించింది.
బాహుబలి'ని స్పెయిన్లో జరుగుతున్న ఓ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. స్పెయిన్లో జరుగుతున్న సిట్గీస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఈ శనివారం, ఆదివారం ప్రత్యేకంగా 'బాహుబలి ది బిగినింగ్' చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.
భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.
చిత్రం విడుదలై నేటితో 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చెన్నైలోని పలు సినిమా థియేటర్లలో ఆన్లైన్ బుకింగ్స్లో ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
మరో ప్రక్క ఈ చిత్రానికి సీక్వెల్గా 'బాహుబలి-2' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 'బాహుబలి-2' కొత్త సెట్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో స్థల పరిశీలన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలిపారు. ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్, మకుట వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ పీట్ డ్రేపర్లతో కలిసి సెట్స్కోసం తగిన స్థలాన్ని వెదుకుతున్నట్లు పేర్కొన్నారు.

రామోజీ ఫిలింసిటీలో కొత్త సెట్స్ నిర్మాణం గురించి ప్రొడక్షన్ డిజైనర్ సాబుసిరిల్, వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ పీట్ డ్రాపర్తో సమాలోచనలు జరిపారు. అక్కడ సెట్స్ రూపుదిద్దుకోవడమే ఆలస్యం. వెంటనే చిత్రీకరణ మొదలుపెడతారు.
వచ్చే నెల నుంచి చిత్రీకరణ పనులు మొదలవ్వొచ్చని తెలుస్తోంది. జులై 10న విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' బాక్సాఫీసు దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా 'బాహుబలి: ది కన్క్లూజన్' తెరకెక్కబోతోంది.


Click it and Unblock the Notifications











