గాంధీ, నెహ్రూ అంటే ఎవరు?: అక్కినేని నాగేశ్వరరావు
"నేటితరం మూలాల్ని మర్చిపోతున్నారు. ఇవ్వాల్టి రేపటికి పాతదైపోతుంది. దాని గురించి ఆలోచించే స్థితిలో లేరు. ముందుముందు మహాత్మాగాంధీ, నెహ్రూ అంటే ఎవరు? ఏం చేశారు? అంటూ అడుగుతారు.సినిమారంగం కూడా అలాగే తయారైంది. అంటూ అక్కినేని నాగేశ్వరరావు ఈ తరం వాళ్లకి చురకలు వేసారు. అభ్యుదయ చలనచిత్ర రథసారథి 'గూడవల్లి రామబ్రహ్మం' పుస్తకాన్ని సుప్రసిద్ధ నటులు అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. టి.ఎస్. జగన్మోహన్ రచించిన ఈ పుస్తకాన్ని క్రియేటివ్ లింక్స్ సంస్థ ప్రచురించింది. ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో గూడవల్లి రామబ్రహ్మంతో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఇలా స్పందించారు.
అలాగే సినిమా మూలాల్ని మర్చిపోతోంది. సినిమాకు చక్కటి రోడ్డు వేసి భవిష్యత్కు రాజమార్గం చూపిన నిర్మాత దర్శకులు ఎంతోమంది ఉన్నారు. వారినంతా మర్చిపోతున్నారు. మాలపిల్ల అంటూ.. చాందస రోజుల్లోనే మాల అమ్మాయికి, బ్రాహ్మణుడి యువకుడికి లవ్స్టోరీ నడిపిన వ్యక్తి. ఆయన దర్శకత్వంలో 'మాయలోకం', 'పల్నాటి యుద్ధం' చిత్రాల్లో నటించాను. 'మాలపిల్ల' చిత్రంతో ఆయన సంచలనం సృష్టించారు. ఆయన నన్ను ఓ తండ్రిలా ఆదరించారు. ఎంతగా అంటే తన ఆస్తిని కూడా ఇచ్చి, తనే నాకు పెళ్లి జరిపించాలనుకున్నంతగా. నా జీవితంలో ఘంటసాల బలరామయ్యగారు, రామబ్రహ్మంగారు మరో జన్మకు కూడా మరచిపోలేనంత సహాయం చేశారు. ఆయన తీసిన సినిమాల్ని చూస్తే చాలు ఆయనకు సమాజం పట్ల ఎంత బాధ్యతో ఉందో తెలుస్తుంది. సినిమా పరిశ్రమ రామబ్రహ్మంగారికి తగిన స్థానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిర్మాతల మండలి నాకు స్థలం చూపిస్తే వారి శిల్పం చేయించి ఇస్తాను'' అని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications