తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు.. ఇదీ రాజమౌళి రియాక్షన్
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే జాతీయ చలన చిత్ర అవార్డు విజేతల వివరాలు ఈ రోజు ప్రకటించబడ్డాయి. భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డులను సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్కు ప్రకటించారు. నిజానికి ఈ 66వ చలన చిత్ర అవార్డులు ఏప్రిల్ నెలలోనే విడుదలవ్వాల్సి ఉండగా 2019 లోక్ సభ ఎన్నికల కారణంగా ఆలస్యం అయింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఈ 66వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పలు దక్షిణాది చిత్రాల హవా కొనసాగింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పలు సినిమాలకు గాను వేరు వేరు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. 'మహానటి' సినిమా ఉత్తమ చిత్రంగా సెలెక్ట్ కాగా, అదే సినిమాకు గాను ఉత్తమ హీరోయిన్ కేటగిరీలో కీర్తి సురేష్ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా రంగస్థలం, చిలసౌ, అ! చిత్రాలు ఇతర కేటగిరీల్లో అవార్డులు పొందాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ అవార్డులపై స్పందించగా తాజాగా రాజమౌళి రియాక్ట్ అయ్యారు. ''వివిధ కేటగిరీల్లో తెలుగు సినిమాలు అవార్డులు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. మహానటి, రంగస్థలం, అ!, చి ల సౌ చిత్రాల యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు'' అని ట్వీట్ చేశారు జక్కన్న.
బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది జులై నెలలో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











