తాతలా కుంచెపట్టిన బ్రహ్మానందం మనవడు.. ఫోటోలు వైరల్
బ్రహ్మానందం.. ఈ పేరు వినగానే తెలుగువారి ముఖాలు వెలిగిపోతాయి. తెలియకుండా పెదాలు విచ్చుకుని చిరునవ్వులు చిందించడం ఖాయం. దశాబ్ధాలుగా తన కామెడీ టైమింగ్తో నవ్వులు పంచుతున్నారు. తెరపై బ్రహ్మీ కనిపిస్తే చాలు హీరోలకి మించి థియేటర్లు దద్దరిల్లిపోతాయి. దాదాపు 1100కు పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించి తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. నటుడిగా బ్రహ్మానందం చేయని పాత్రంటూ లేదు.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన కొన్నిసార్లు సెంటిమెంట్తో కంటతడి పెట్టించారు. ఇప్పటి జనరేషన్ బ్రహ్మానందాన్ని 'గాడ్ ఆఫ్ మీమ్స్'గా పిలుస్తూ ఆయనను మరో మెట్టుపైకి ఎక్కించింది. ఈ రకంగానూ ప్రజలను నవ్వించడం ఒక్క బ్రహ్మానందానికే చెల్లింది.
ఈ స్థాయికి రావడం వెనుక బ్రహ్మానందం ఎంతో శ్రమించారు. దీనికి సంబంధించిన విషయాలను తన ఆత్మకథలో ప్రస్తావించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన తాను చదువుకోవడానికి ఎంతోమంది ఎన్నోరకాలుగా సాయం చేశారని బ్రహ్మానందం చెప్పారు. చదువుకుంటూనే కాలేజీకి వెళ్లే దారిలో లారీలకు పెయింటింగ్ వేసే షాపులో పనికి చేరానని.. అప్పుడు నాలుగు, ఐదు రూపాయలు అందుకునేవాడినని అక్కడ పనిచేస్తూనే ఎంఏ పూర్తి చేశానని ఆయన గుర్తుచేశారు.

ఇకపోతే.. బ్రహ్మానందంలో అద్భుతమైన నటుడే కాదు, ఆయనలో మంచి పెయింటర్ కూడా. బ్రహ్మీ చేతి నుంచి జాలువారిన చిత్రాలు ఎన్నో. గతంలో శ్రీరాముడు హనుమంతుడిని హత్తుకున్న ఫోటో , తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన ఇంటికి వచ్చిన వారిని, తాను కలిసిన వారికి బ్రహ్మానందం తన చేత్తో గీసిన చిత్రాలను గిఫ్ట్గా ఇస్తారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి బహుమతినే పంపారు బ్రహ్మీ. తద్వారా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ప్రశంసలు అందుకున్నారు.
ఇంట్లో పిల్లలకు మన అభిరుచులు, అలవాట్లు, పోలికలు వస్తాయని పెద్దలు అంటుంటారు. తల్లిదండ్రులు, తాతలు నుంచి పిల్లలకు కొన్ని లక్షణాలు వారసత్వంగా వస్తాయి. కొందరిని చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. ఇప్పుడు బ్రహ్మానందం విషయంలోనూ అదే జరిగింది. ఆయన మనవడు పార్ధ కూడా తాతయ్య మాదిరే కుంచె పట్టి పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మీ పెద్దకుమారుడు రాజా గౌతమ్ - జ్యోత్స్నా రెడ్డి దంపతులకు పార్థ , ఓ కుమార్తె జన్మించారు.

పార్థ చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవాడు.. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బ్రహ్మానందం బయటపెట్టారు. అందరినీ తాను నవ్విస్తే.. తనను మాత్రం మనవడు నవ్విస్తాడని తెలిపారు. తాజాగా ఈ చిన్నారి తాతయ్య మాదిరిగా చిత్రకారుడిలా మారిపోయాడు. చిత్రకారుడిలా కుంచె పట్టి బొమ్మ గీస్తున్న పార్ధ ఫోటోను బ్రహ్మానందం చిన్నకుమారుడు సిద్ధార్ధ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీకి మరో బ్రహ్మానందం దొరికేశాడని.. తాతకు తగ్గ మనవడంటూ నెటిజన్లు పార్ధపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా.. రాజా గౌతమ్ తండ్రి అడుగుజాడల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పల్లికిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమా బాగానే ఆడటంతో అదే ఊపులో చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో సినిమాలకు గౌతమ్ దూరమయ్యారు..లాంగ్ గ్యాప్ తర్వాత గౌతమ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. రాహుల్ యాదవ్ నక్కా బ్యానర్లో ' బ్రహ్మ ఆనందం ' అనే సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇందులో కొడుకు గౌతమ్కు బ్రహ్మానందం తాతగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











