'ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం' చిత్రం కథేమిటి?
ఇంతకీ ఈ బ్రాహ్మణీకం కథమిటి అంటే... స్త్రీకి లోక జ్ఞానం లేకుండా పెంచితే ఏమవుతుందో చెప్పడానికి చలం గారు వ్రాసిన నవల "బ్రాహ్మణీకం" అని చెప్తూంటారు. సుందరమ్మ చుట్టూ ఈ కథ తిరుగుతూంటుంది. ఆమెకి చిన్న వయసులో పెళ్ళి అయ్యింది. ఆరోగ్య కారణాల వల్ల భార్యకు రెండు నెలలు దూరం గా ఉండాలని వైద్యులు సలహాఇస్తారు. భౌతిక సుఖం వల్ల ప్రాణాపాయం ఉందని హెచ్చరించినప్పటికీ దంపతులు ఆ హెచ్చరిక పాటించకపోవటంతో భర్త మరణిస్తాడు. భర్త చనిపోయిన తరువాత సుందరమ్మ తన మేనమామ ఇంటికి వెళ్ళింది. ఆమె మేనమామ గారి ఇంటిలో చంద్రశేఖరం అనే సంగీతం మాస్టర్ ఉండేవాడు. చంద్రశేఖరం ఆమెని లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అందు వల్ల సుందరమ్మ గర్భవతి అయ్యింది. సుందరమ్మ మేనమామ వెంకటరామయ్య పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల అతను చంద్రశేఖరాన్ని పట్టుకువచ్చి అతన్ని సుందరమ్మకి ఇచ్చి పెళ్ళి చేశాడు.
భర్త చనిపోయిన స్త్రీకి రెండవ పెళ్ళి చేసుకునే హక్కు ఉందని సుందరమ్మకి తెలియదు. భర్త లేకుండా బిడ్డని కంటే సమాజంలో పరువు పోతుందని ఆమె చంద్రశేఖరాన్ని పెళ్ళి చేసుకుంది. చంద్రశేఖరానికి కూడా సుందరమ్మని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. వెంకటరామయ్య బలవంతం వల్ల చంద్రశేఖరం సుందరమ్మని పెళ్ళి చేసుకున్నాడు. చంద్రశేఖరం కూడా సుందరమ్మని కామం తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు కానీ ఆమెని ప్రేమగా చూడలేదు. సుందరమ్మకి బిడ్డ పుట్టింది కానీ సుందరమ్మకి బిడ్డని ఎలా పెంచాలో తెలియదు. చిన్న వయసులో పెళ్ళి జరగడం వల్ల ఆమెకి బిడ్డని పెంచే విధానం తెలియలేదు. చంద్రశేఖరం బిడ్డ గురించి పట్టించుకోలేదు.
బిడ్డకి జ్వరం వచ్చినప్పుడు కూడా చంద్రశేఖరం వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టలేదు. సుందరమ్మ తన చీరలు, నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బులతో పూజలు చెయ్యించింది. ఆమె దగ్గర మందులకి డబ్బులు లేని సమయంలో రామయ్య అనే వ్యక్తి తాను డాక్టర్ నని చెప్పుకుని, డబ్బులు తీసుకోకుండా వైద్యం చేస్తానని చెప్పి ఆమెతో కోరిక తీర్చుకున్నాడు. రామయ్య డాక్టర్ కాదని తెలిసిన తరువాత సుందరమ్మ ఆవేశం చెంది, గుండె ఆగి చనిపోయి, బిడ్డ మీద పడిపోయింది. స్త్రీకి లోక జ్ఞానం లేకుండా పెంచితే ఆమెకి తన హక్కులు తెలియకుండా పోతాయి.
ఇదీ క్లుప్తంగా కథ. అయితే ఇలాగే సినిమా గా తీసారా లేదా అనేది ఎవరకీ తెలియదు. ఈ సినిమా చిత్రీకరణ అభ్యంతరకరంగా ఉందని విమర్శకులు ఆరోపణలు వచ్చాయి. పబ్లిసిటీ కోసం చిత్రం తాలూకు ట్రైలర్స్ను యుట్యూబ్ సైట్లో పెట్టటంతో దేశవ్యాప్తంగా బ్రాహ్మణ సమాజం నుంచి వ్యతిరేకత మొదలైంది. సహానీ కమిటీ బుధవారం 'ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం' చిత్రాన్ని వీక్షించింది. ఈ సినిమా ప్రదర్శనలను తక్షణం నిలిపివేయాలని సిఫారసు చేసిన ఈ కమిటీ నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎండీ ఆర్వి చంద్రవదన్ ప్రభుత్వానికి సమర్పించారు. ఈ చిత్రాన్ని 'పడకగది శృంగారం, అశ్లీలం' లక్ష్యంగా మాత్రమే నిర్మించారని, ఒక నిర్దిష్ట కులానికి చెందినవారి మనోభావాలను గాయపరిచేలా 'ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం' సినిమా ఉన్నదని, బహిరంగ ప్రదర్శనలకు ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తన నివేదికలో కమిటీ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications












