చిరంజీవి కూడా ఆయన్ని మరచిపోయారు.. స్టంట్ మాస్టర్ రాజు భార్య వ్యాఖ్యలు!
ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు 2009లోనే గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఒంగోలు ఆయన సొంత ఊరు. ప్రస్తుతం రాజు కుటుంబ సభ్యులు ఒంగోలు జిల్లాలోనే నివాసం ఉంటున్నారు. రాజు 67వ జయంతిని వేటపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజు భార్య అనంత లక్ష్మి మాట్లాడుతూ టాలీవుడ్ లోని బడా హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైట్స్ విషయంలో ఎందరో హీరోలకు గురువు అయిన నా భర్తని ఇప్పుడు అందరూ మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె చిరంజీవిపై కూడా కొన్ని కామెంట్స్ చేశారు.

స్టార్ హీరోలందరికీ
నా భర్త స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రాలకు కూడా ఫైట్ మాస్టర్ గా చేశారు. ఆ తర్వాత చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య లాంటి స్టార్ హీరోలందరికీ ఫైట్స్ విషయంలో గురువులా మారారని అనంతలక్ష్మి అన్నారు. రాజు ఫైట్స్ అందించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ హీరోలందరికీ రాజు ఫైట్స్ విషయంలో అద్భుతమైన శిక్షణ ఇచ్చారు అని అనంతలక్ష్మి తెలిపింది.

9 ఏళ్ళు అవుతోంది
తన భర్త చనిపోయి 9 ఏళ్ళు అవుతోంది. కానీ ఇంత వరకు చిత్ర పరిశ్రమకు చెందిన వారు కానీ, ప్రభుత్వం కానీ తమ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని అనంతలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. రాజు ఇచ్చిన ట్రైనింగ్ తో చిరంజీవి అద్భుతంగా ఫైట్స్ చేసి గొప్పస్థాయికి ఎదిగారు. గురువు లాంటి రాజను చిరంజీవి కూడా మరిచిపోయారని ఆమె అన్నారు. మిగిలిన హీరోలు కూడా పట్టించుకోవడం లేదు.

వాళ్ళు కూడా ఆయన శిష్యులే
టాలీవుడ్ లో ఫైట్ మాస్టర్స్ గా అగ్రస్థానానికి ఎదిగిన రామ్ లక్ష్మణ్, బాహుబలి చిత్రానికి పనిచేసిన సాల్మన్ రాజు కూడా తన భర్త శిష్యులే అని అనంత లక్ష్మి అన్నారు. సాల్మన్ రాజుకు జాతీయ అవార్డు రావడం సంతోషించదగ్గ విషయం అని కానీ తన గురువునే మరచిపోవడం బాధాకరం అని అనంతలక్ష్మి తెలిపింది.

నటుడిగా కూడా
స్టంట్ మాస్టర్ రాజు పలు చిత్రాల్లో నటుడిగా కూడా రాణించారు. 2000 తర్వాత ఆయనకు స్టంట్ మాస్టర్ గా బాగా అవకాశాలు తగ్గాయి. 2009లో మృతి చెందారు. ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం తమని గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన సతీమణి అనంత లక్ష్మి కోరారు. అప్పట్లో స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయంటే అందులో తప్పనిసరిగా రాజు ఫైట్ మాస్టర్ గా ఉండేవారు.


Click it and Unblock the Notifications











