చివరి క్షణాల్లో రామానాయుడు అదే ఆలోచన...(ఫోటోస్)
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత, మూవీ మోఘల్ డి.రామానాయుడు క్యాన్సర్తో బాధ పడుతూ ఈ రోజు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన జీవితం మొత్తం సినిమాలకే అంకింతం చేసారు. ఎంతలా అంటే...కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ ఆయన ఆలోచన మాత్రం సినిమా రంగంపైనే...
కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో రామానాయుడు తనయుడు వెంకటేష్ మాట్లాడుతూ.... ఆయన మనసంతా సినిమాలపైనే ఉంది. వైజాగ్ లో స్టూడియో డెవలప్ చేసే విషయమై ఆయన ప్రతి రోజు అన్నయ్యతో మాట్లాడుతుంటారు' అని ఆంగ్ల పత్రికకు వివరించారు.
ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రూపాయి నోటు మీద ఉన్న అన్నీ భాషల్లోనూ సినిమాలు ఎవరైనా తీయగలరా? ఎందుకంటే అది చాలా ఖరీదైన కల. దాన్ని నెరవేర్చుకోవాలంటే.. డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు. సినిమాను ప్రేమించాలి. ఆరాధించాలి.. అంతకు మించి అనుక్షణం తపించాలి. అలా ఎవరైనా ఉంటారా అంటే.. తెలుగోడి చేతి వేళ్లన్నీ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడినే చూపిస్తాయి.

అవార్డులు
వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఆయనది 50ఏళ్ల ప్రస్థానం. దాదాఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న ఆయన శతాధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ రికార్డును సైతం సాధించారు. పద్మభూషన్ లాంటి అత్యున్నత పురస్కారంతో పాటు.. మరెన్నో రివార్డులు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి.

సుపరిచితం
రాముడుభీముడు, ప్రేమ్ నగర్, దేవత, సోగ్గాడు, ముందడుగు, ప్రతిధ్వని, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, ఇంద్రుడు చంద్రుడు, తాజాగా బెండు అప్పారావు ఆర్ఎంపీ. ఈ సినిమాలన్నింటికీ ఒక సారూప్యత ఉంది. ఈ చిత్రాలన్నింటినీ నిర్మించింది రామానాయుడే. తెలుగు సినిమా చూసే ప్రతిఒక్కరికి ఆయన పేరు సుపరిచితం.

ట్రెండ్ సెట్టర్
ఎప్పటికప్పుడు తనదైన ట్రెండ్ సృష్టించటం ఆయనకు మాత్రమే సాధ్యం. రాముడుభీముడు కావచ్చు ప్రేమనగర్ కావచ్చు... అంతెందుకు ప్రేమించుకుందాం రా సినిమానే తీసుకుంటే.. అప్పటివరకూ వచ్చే ప్రేమకథా చిత్రాలకు సరికొత్త రంగు, రుచిని ఇచ్చింది ఆ
సినిమా. ఒక రకంగా ఆయన్ను ట్రెండ్ సెట్టర్ గా చెప్పొచ్చు. మూసధోరణిని బద్ధలుకొట్టి... చిత్రనిర్మాణాన్ని సరికొత్త దిశగా నడిపే నేర్పు రామానాయుడు సొంతం.

నిర్మాతగా తొలి చిత్రం
నేటి ప్రకాశం జిల్లా కారంచేడులో 1936 జూన్ ఆరో తేదీన జన్మించిన ఆయనకు సినిమాలంటే మొదటి నుంచి మక్కువ. 1963లో అనురాగం అనే చిత్రంతో నిర్మాతగా మారారు.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సపోర్టు
ఆయన నిర్మాతగా కుదురుకోవటానికి స్వర్గీయ ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ముఖ్యకారణంగా చెప్పొచ్చు. ఆయన కూడా ఆ విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెబుతారు. తాను పెద్దస్థాయికి వెళ్లాలనని.. నడిచి వచ్చిన దారిని మర్చిపోయే తత్వం ఆయనది కాదు. తరచూ తాను ఈ స్థాయికి రావటానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కీలకభూమిక పోషించారని చెబుతుండే వారు.

సురేష్ ప్రొడక్షన్స్
ఆయన స్థాపించిన సురేష్ ప్రొడక్షన్ సంస్థ తెలుగు సినిమా అభిమానులకు సుపరిచితం. 1964లో ఎన్టీఆర్ హీరోగా రామానాయుడు నిర్మించిన రాముడుభీముడుతో నిర్మాతగా ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది.

అన్ని భాషల్లో..
తెలుగు చిత్రనిర్మాతగా ఆయన ప్రయాణం మొదలుపెట్టినా తర్వాత రోజుల్లో హిందీ,తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ... ఇలా రూపాయి నోటు మీద కనిపించే అన్నీ భాషల్లోనూ సినిమాలు తీశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇన్ని భాషల్లో సినిమాలు తీసిన ఆయన ఇంగ్లిష్ లో కూడా సినిమా తీసారు.

వారసులు
రామానాయుడుకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి సురేష్ బాబు సినినిర్మాతగా సుపరిచితులు. ఇక రెండో కుమారుడు వెంకటేష్. కథానాయకుడిగా ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆయన మనమడు రానా సైతం హీరోగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తెలుగుచలనచిత్ర రంగంలో పేరు తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











