పవన్ కళ్యాణ్ లక్షణాలు వచ్చింది నీకే.. అంత ఈజీగా ఒప్పుకోను.. సుకుమార్!
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి చిత్ర ప్రారంభోత్సవం నేడు ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా వచ్చేసి చిత్రాన్ని ప్రారంభించారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, నాగబాబు, సాయిధరమ్ తేజ్ ఈ వేడుకకు హాజరయ్యారు. సుకుమార్ రైట్స్, మైత్రి మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుకుమార్ తన శిష్యుడు బుచ్చిబాబుని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ వేడుకలో సుకుమార్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

అంత ఈజీగా ఒప్పుకోను
నావద్ద అసిస్టెంట్స్ గా చాలా మంది చేరుతుంటారు. కానీ అందరిని న శిష్యులు అని చెప్పుకొను. బుచ్చిబాబు నా వద్దకు వచ్చి 8 ఏళ్ళు అవుతోంది. అనేక కథలు వింటుంటా. అంత ఈజీగా ఏ కథని నేను ఒప్పుకోను. కానీ బుచ్చిబాబు చెప్పిన కథ నాకు నచ్చింది. ప్రపంచంలో ఎక్కడా రాని కథ నా సినిమాల్లో ఉండాలని అనుకుంటా. అలాంటి కథతోనే తనని బుచ్చిబాబు మెప్పించాడని సుకుమార్ అన్నారు.

నీ కొడుకు గొప్ప డైరెక్టర్
బుచ్చిబాబు తల్లి తరచుగా అడుగుతూ మా అబ్బాయి డైరెక్టర్ అవుతాడా అని అడుగుతుంటారు. ఇప్పుడు చెబుతున్నా.. మీ కొడుకు గొప్ప డైరెక్టర్ అవుతాడు. బుచ్చిబాబు నాశిష్యుడే అని కూడా గర్వంగా చెబుతున్నా అని సుకుమార్ తెలిపారు. మైత్రి మూవీస్ ఈ చిత్రంలో భాగం కావడానికి ముందుకు వచ్చింది. వాళ్ళతో నేను చాలా సన్నిహితంగా కలసి పోయా అని సుకుమార్ అన్నారు.

1600 అమ్మాయిలని
బుచ్చిబాబు కథ సిద్ధం చేయగానే హీరోగా ఎవరిని అనుకుంటున్నావు అని అడిగాను. వైష్ణవ్ అని చెప్పాడు. ఇంకెవరినైనా చూడు అని చెప్పినా అతడు వైష్ణవ్ కి ఫిక్స్ అయిపోయాడు. వైష్ణవ్ మాట్లాడే విధానం, నడవడిక ఈ చిత్రానికి సరిపోతుంది అని తెలిపాడు. ప్రతి రోజు వైష్ణవ్ ఫోటోలు చూపించేవాడు. ఇక హీరోయిన్ గా తెలుగు అమ్మాయే కావాలని అనుకున్నాము. ఆడిషన్స్ మొదలు పెట్టగానే మనీషా బాగా నచ్చింది. ఆమెని ఎంపిక చేశాం. కానీ బుచ్చిబాబు మాత్రం సంతృప్తిగా లేడు. ముంబై వెళ్లి 1600 మంది అమ్మాయిలని ఆడిషన్స్ చేశాడు. తిరిగి వచ్చి ఈ అమ్మాయే బెటర్ అని అన్నాడు.

పవన్ కళ్యాణ్ లక్షణాలు
సుకుమార్ వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. నీకు హీరోగా మంచి భవిష్యత్తు ఉంది. పవన్ కళ్యాణ్ గారి లక్షణాలు వచ్చింది నీకే అని మీ ఇంట్లో అందరూ చెబుతున్నారు. ఎప్పుడూ సైలెంట్ గా, ఎలాంటి భేషజాలు లేకుండా వైష్ణవ్ ఉంటాడని సుకుమార్ తెలిపారు. నా డార్లింగ్ దేవిశ్రీ ప్రసాద్ కు ఈ చిత్ర కథ నచ్చింది. దేవిశ్రీకి కథ నచ్చితే సాంగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవిశ్రీ ఈ చిత్రానికి అద్భుతమైన ఆల్బం అందించబోతున్నాడు అని సుకుమార్ తెలిపారు.

చిరంజీవి 4 గంటల పాటు
ఈ చిత్రం ప్రారంభం కావడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఈ కథని మూడు సార్లు విన్నారు. ప్రతి సారి నాలుగు గంటల సమయం మాతో చర్చించడానికి వెచ్చించారు. అంత ఓపికగా ఉన్నారు కాబట్టే ఆయన మెగాస్టార్ అని సుకుమార్ తెలిపారు. ఈ చిత్రానికి చిరంజీవి గారు అందించిన సలహాలు అద్భుతం. ఇప్పటి కుర్రాడిలాగా ఆయన ఆలోచనలు ఉన్నాయని సుకుమార్ తెలిపారు.


Click it and Unblock the Notifications











