ఇపుడు బాలీవుడ్, నెక్ట్స్ హాలీవుడ్ : సుమన్
హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి రోజున, వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదంతో బాలీవుడ్ ప్రవేశం చేసినట్లు ప్రముఖ నటుడు సుమన్ పేర్కొన్నారు. శనివారం ముంబైలో పార్లే ప్రాంతంలో ఉన్న మోతీలాల్ బస్వాల్ కాంప్లెక్స్లో హిందీ చిత్రం 'గబ్బర్' కోసం సుమన్ షూటింగులో పాల్గొన్నారు.
అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్నారు. తమిళ చిత్రం 'రమణ'(తెలుగులో ఠాగూర్) చిత్రాన్ని హిందీలో 'గబ్బర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు దర్శకుడు క్రిష్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హబీబ్ ఖాన్ ఈచిత్రానికి కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.

'శివాజీ' చిత్రం తర్వాత చాలా అవకాశాలు వచ్చినప్పటికీ చిత్రాల ఎంపికలో జాగ్రత్తగా ఉన్నట్లు సుమన్ చెప్పారు. 'గబ్బర్'లో నన్ను రికమండ్ చేసింది అక్షయ్ కుమార్. ఆయనకు ఈ సందర్భంగా కృజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాలీవుడ్ తెరంగ్రేటం ఆలస్యమైనప్పటికీ ఒక మంచి సినిమా ద్వారా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు సుమన్ .
హిందీ చిత్రాల్లో అవకాశం వచ్చినప్పటికీ అన్ని భాషల చిత్రాల్లో నటిస్తాను అని సుమన్ పేర్కొన్నారు. త్వరలో హాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతున్నాను. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను సుమన్ ఖండించారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదు. భవిష్యత్లో ఒక జాతీయ పార్టీలో చేరుతానని సుమన్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











