స్క్రీన్ షాట్స్ బయటపెట్టిన సందీప్ కిషన్.. ఆనందాన్ని ఇలా పంచుకున్నాడు
కెరీర్ తొలినాళ్లలో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' తర్వాత సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈ కుర్ర హీరో ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో సొంత బ్యానర్ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అందులో తొలి సినిమాను తానే నటించాడు. అదే 'నిను వీడని నీడను నేనే'.
అన్యా సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను కార్తీక్ రాజు తెరకెక్కించాడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వీ స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. సస్పెన్స్ థ్రిలర్గా తెరకెక్కిన ఈ సినిమా రెండో రోజూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీంతో సందీప్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు. ఇప్పటికే తన సినిమాను సక్సెస్ చేసిన ఫ్యాన్స్ అందరితో పాటు సినీ ప్రియులందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు.
తాజాగా తనకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ను సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఈ కాంప్లిమెంట్ ఇచ్చింది మరెవరో కాదు.. సందీప్ కిషన్ తండ్రే. శనివారం ఉదయం మార్నింగ్ షో చూసిన ఆయన సందీప్కు మెసేజ్ పెట్టారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ యంగ్ హీరో. అందులో ''నేను ఏఎంబీ థియేటర్ దగ్గర ఉన్నాను. మార్నింగ్ షోకు థియేటర్ 90 శాతం నిండింది. ఫస్ట్ హాప్ సూపర్ మ్యాన్' అంటూ ఆయన మెసేజ్ చేశారు.
దీనిని ట్విట్టర్లో షేర్ చేసిన సందీప్ కిషన్ ''మీ తల్లిదండ్రుల ఆనందానికి మీరు కారణమవ్వటమే నిజమైన సంతోషం. మా నాన్న నుంచి వచ్చిన ఈ మెసేజ్ చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అంటూ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











