అల్లరి నరేష్ అడగ్గానే కాదనలేక పోయిన సునీల్
హైదరాబాద్ : కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ కమెడియన్ వేషాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. హీరో రేంజి పాత్రలు తప్ప ఇతర సినిమాల్లో ఆయన నటించడం లేదు. అయితే తన సహచర నటుడు, కామెడీ హీరో అల్లని నరేష్ స్వయంగా అడగటంతో...కానలేక పోయారు సునీల్. అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో రూపొందుతున్న 'యాక్షన్ 3డి' చిత్రంలో అతిథి పాత్రలో చేయడానికి ఒప్పుకున్నారు.
'యాక్షన్ 3డి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనిల్ సుంకర....ఈ చిత్రంలో సునీల్తో ఓ చిన్న రోల్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. నేను చెబితే ఒప్పుకుంటాడో లేదో అనే అనుమానంతో ఈ బాధ్యతను హీరో నరేష్కు అప్పజెప్పాడు ఆ దర్శకుడు. నరేష్ స్వయంగా ఈ విషయమై సునీల్ను అడగటంతో కాదనలేకపోయారట.
అల్లరి నరేష్తో స్నేహం నేపథ్యంలో సునీల్ ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవలే ఆ సీన్ చిత్రీకరణ కూడా జరిగింది. సీన్ చాలా బాగా వచ్చిందని, ఆ సీన్ సినిమాకు బాగా ప్లస్సవుతుందనే దర్శకుడు ఆయనతో గెస్ట్ రోల్ చేయించారని యూనిట్ సభ్యులు అంటున్నారు.
యాక్షన్ 3డి చిత్రంలో ఇంకా వైభవ్ రెడ్డి, శ్యామ్, రాజు సుందరం, స్నేహా ఉల్లాల్, కామ్నా జెఠ్మలానీ, రీతూ బర్మేచ, నీలం ఉపాధ్యాయ తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కిచ్చా సుదీప్, పోసాని కృష్ణ మురళి కూడా ఇందులో అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ చిత్రానికి తమిళ వెర్షన్లో 'ఆసు రాజా రాణి జాకీ మాత్రుమ్ జోకర్' అనే టైటిల్ ఖరారు చేసారు. అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని అతని సోదరుడు రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తండ్రి కొడుకులైన బప్పి-బప్పాలహరి తమన్తో కలిసి ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











