మహేష్ బాబు-త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి!
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే 'అతడు', 'ఖలేజా' సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో వీరి కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. పస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు కోసం కథను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తాడని అంటున్నారు. త్వరలో ఈ విషయమై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు 'బిజినెస్ మేన్-2' చిత్రం చేస్తున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కారణాలేమైనా ఆ ప్రాజెక్టు ఆచరణకు నోచుకోలేదు. మరి మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమా పట్టాలెక్కడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై మాత్రం సరైన క్లారిటీ రావడం లేదు.
ప్రస్తుతం మహేష్ బాబు '1'(నేనొక్కడినే) చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శ్రీను వైట్ల దర్శకత్వలో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో యూటీవీ మూవీస్ బేనర్లో మరో సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు. ఈ పూర్తి కావడానికే చాలా సమయం పడుతుంది. వస్తే గిస్తే మహేష్-త్రివిక్రమ్ మూడో సినిమా వచ్చే ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది.
మహేష్ బాబు '1' సినిమా విషయానికొస్తే... సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్టెనర్గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్. జనవరి 10న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












