హైదరాబాద్లో ఉన్నానా? న్యూయార్క్లో ఉన్నానా అనిపించింది.. చంద్రబాబు విజన్పై రజనీకాంత్ ప్రశంసల వర్షం
నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. విజయవాడలో జరిగిన ఈ వేడుకల్లో ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టు వెంకటనారాయణ, చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఇతర టీడీపీ నేతలు హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. చంద్రబాబు విజన్పై ప్రశంసల వర్షం కురిపించారు. రజనీకాంత్ మాట్లాడిన మాటల వివరాల్లోకి వెళితే..
తప్పులుంటే క్షమించండి: వేదికపైన ఉన్న నా ఆప్త మిత్రులు, తెలుగు దేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు.. నటరత్న నందమూరి తారక రామారావు కుమారుడు, నా తమ్ముడు బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్టు వెంకటనారాయణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న తెలుగు జనాలకు వందనాలు. ఇంత పెద్ద ఫంక్షన్లో నేను తెలుగు మాట్లాడి చాలా రోజులైంది. ఒకవేళ ఏమైనా తప్పులుంటే క్షమించాలి అని రజనీకాంత్ అన్నారు.
చంద్రబాబు అభివృద్ది గురించి మాట్లాడకపోతే: బుద్ది చెబుతుంది ఏం మాట్లాడలో.. సమర్ధత చెబుతుంది ఎలా మాట్లాడాలో. సభ చెబుతుంది ఎంత సేపు మాట్లాడాలో.. అనుభవం చెబుతుంది ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో చెబుతుంది. ఈ సభను చూస్తే రాజకీయం మాట్లాడాలనిపిస్తుంది. కానీ అనుభవం వద్దురా రజనీ.. జాగ్రత్త.. రాజకీయాలు మాట్లాడవద్దు అని అనుభవం చెబుతుంది. కానీ నా ఆప్త మిత్రుడు చంద్రబాబు నాయుడు గురించి రాజకీయాలు మాట్లాడకపోతే ఈ సభకు అర్దం ఉండదు అని రజనీకాంత్ అన్నారు.

24 గంటలు అభివృద్ది గురించే: చంద్రబాబు నాకు 30 ఏళ్ల నుంచి మిత్రుడు. నా మిత్రుడు మోహన్ బాబు నాకు పరిచయం చేయిస్తూ.. ఈయన పెద్ద నాయకుడు అవుతారని చెప్పారు. హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా ఆయనతో మాట్లాడుతాను. ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఆనందం కలుగుతుంది. ప్రజలకు మంచి చేయాలనే ఆయన విజన్. ఆయన 24 గంటలు అభివృద్ది గురించే ఆలోచిస్తారు అని రజనీకాంత్ తెలిపారు.

97లోనే 2020 విజన్ గురించి: చంద్రబాబు నాయుడు గొప్ప దూరదృష్టి కలవారు. ఆయన గొప్ప విజనరీ. ఇది నేను చెప్పేది కాదు. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద పొలిటిషియన్స్ అందరూ చంద్రబాబు విజన్ గురించి చెబుతారు. ఆయన టాలెంట్ గురించి విదేశాల్లో ఉండేవాళ్లకు ఎక్కువగా తెలుసు. 1996-97లో 2020 విజన్ గురించి చెప్పారు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు అని రజనీకాంత్ చెప్పారు.

లక్షలాది మందికి ఉపాధి: హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు బిల్ గేట్స్, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మ్యాగ్నెట్లు వచ్చి ప్రశంసలు కురిపించడమే కాకుండా కంపెనీలు స్థాపించారు. దాని వల్ల వేల మంది కాదు.. లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఫారిన్ చాలా మంది సుఖంగా బతుకుతున్నారంటే.. అందుకు కారణం చంద్రబాబు అని రజనీకాంత్ అన్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్కు వెళితే: హైదరాబాద్లో జైలర్ సినిమా షూటింగ్ చేశాం. ఆ సమయంలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో రాత్రి పర్యటించాను. నేను ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్లో ఉన్నానా? అనే ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు సీఎం చంద్రశేఖర్ రావు కూడా అభివృద్ది చేస్తున్నారు. నేను ఎప్పుడు అపాయింట్ అడిగినా ఇచ్చేస్తారు. నా జన్మదినం రోజున ఫోన్ చేసి మాట్లాడుతారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కనుక.. ఖాళీగా ఉన్నారనుకొంటారు. కానీ 2040 కోసం విజన్ తయారు చేశాడు. అది కనుక అమలు జరిగితే.. ఇండియాలో ఏపీ నంబర్ వన్ స్టేట్ అవుతుంది అని రజనీకాంత్ అన్నారు.


Click it and Unblock the Notifications











