Kantara 'వరాహ రూపం' వివాదంపై మేకర్స్ కి ఊరట.. హీరో, నిర్మాతను అరెస్ట్ చేయలేరన్న సుప్రీం కోర్టు!
కాంతార సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా తెలిసిందే. కన్నడ నాట ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఎల్లలు దాటి విస్తరించింది. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార' చిత్రాన్ని కేజీఎఫ్ సిరీస్ నిర్మాతలైన హొంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు.
ఈ సినిమా స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నటీనటుల యాక్టింగ్, మ్యూజిక్ ఇలా ప్రతి అంశం సినిమాపై సక్సెస్ టాక్ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో ప్రధాన హైలెట్ గా నిలిచింది వరాహ రూపం పాట. ఈ పాట కాపీ కొట్టారని వివాదం కూడా నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై సుప్రీం కోర్టు మేకర్స్ కు ఊరటనిచ్చే విషయం తెలియజేసింది.

తుళునాడులోని సంస్కృతులు..
ఒక చిన్న చిత్రంగా కన్నడలో విడుదలై దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది కాంతార. కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన హోంబలే ఫిలీంస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ సినిమాకు హీరోగా, డైరెక్టర్ గా మెస్మరైజ్ చేశాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ చిత్రంలో కర్ణాటకలోని తుళునాడులో ఉన్న సంస్కృతులను చక్కగా చూపించారు. ముఖ్యంగా అక్కడి భూతకోల సాంప్రదాయం సినిమాకు హైలెట్ గా నిలిచింది.

నవరసం పాటకు కాపీ అంటూ..
ఇక కాంతారా క్లైమాక్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోపాటు రిషబ్ షెట్టి నట విశ్వరూపం చూపించిన 'వరాహ రూపం' పాట ప్రేక్షకులకే కాదు విమర్శకులు సైతం నోరు వెళ్లబెట్టేలా చేసింది. అయితే ఆ పాట వివాదమైన విషయం తెలిసిందే. 'వరాహ రూపం' పాటను తమ నుంచి కాపీ కొట్టారని 'తాయిక్కుడమ్ బ్రిడ్జ్' అనే మ్యూజిక్ ట్రూప్ ఆరోపించింది. తాము స్వరపరిచిన 'నవరసం..' పాటకు కాపీ అని కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ పాటను నిలిపివేయాలని కోజికోడ్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది.

పాటను తొలగించాలని నిషేధం..
కేరళలోని థియేటర్లలో, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో (యూట్యూబ్, ఓటీటీ) వరాహ రూపం పాటను ప్లే చేయకూడదని కోర్టు తెలిపింది. ఆ తర్వాత అది తమ పరిధిలోని విషయం కాకపోవడంతో వరాహ రూపంపై నిషేధాన్ని ఎత్తివేసింది కేరళలోని కోజికోడ్ జిల్లా కోర్టు. ఆ తర్వాత 'తాయిక్కుడమ్ బ్రిడ్జ్' కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. పాటను తొలగించాలని నిషేధం విధించింది. ఇప్పుడు తాజాగా ఈ షరతుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

రిషబ్ శెట్టికి ఊరట..
కాంతార మూవీలోని వరాహ రూపం పాట కాపీ రైట్స్ ను ఉల్లంఘించారనే క్రిమినల్ కేసులో చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్, డైరెక్టర్ రిషిబ్ శెట్టికి సుప్రీం కోర్టు పెద్ద ఊరటనిచ్చింది. బారత ప్రధాన న్యాయమూరతి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ వీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దివాలతో కూడిన ధర్మాసనం కిరగందూర్, శెట్టి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ ను శుక్రవారం లిఫ్ట్ చేసినప్పటికీ దానిని విచారించేందుకు సీజేఐ అంగీకరించారు.

అరెస్ట్ చేయలేరు..
వరాహ రూపం సాంగ్ కాపీ రైట్స్ వివాదంలో కేరళ హైకోర్టు విధించిన షరతును సుప్రీంకోర్టు శుక్రవారం సడలించి మేకర్స్ కు ఊరట కలిగించింది. కాంతార సినిమా నుంచి ఆ పాటను తొలగించాల్సిన అవసరం లేదని తెలిపింది. కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో పోలీసులు ఇద్దరినీ విచారించవచ్చని, అయితే వారని అరెస్ట్ చేయలేరని కోర్టు పేర్కొంది. అలాగే వరాహ రూపం పాటను ప్రదర్శించకూడదనే కేరళ హైకోర్టు ఆదేశాలను విమర్శించింది.

విచారణను కొనసాగించండి..
వరాహ రూపం పాటకు సంబంధించి విధించిన షరతులపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాల్సిందిగా కేరళ హైకోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. వారి విధించిన షరతుల్లో ఫిబ్రవరి 12, 13 రెండు రోజుల్లో రెండు రోజుల పాటు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య విచారణకు హాజరు కావాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ విచారణను కొనసాగించవచ్చని తెలిపింది. అయితే వారిని అరెస్ట్ చేస్తే కోర్టు ముందు హాజరు పర్చాలని పేర్కొంది. వారు కోరుకుంటే రూ. 50 వేలు కట్టి బెయిల్ పొందవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది.


Click it and Unblock the Notifications











