Santosham Awards: 'సంతోషం'పై కన్నడ హీరో, హీరోయిన్లు ఫైర్.. టాలీవుడ్ పరువును సురేష్ తీశారా?
గోవాలో జరిగిన సంతోషం అవార్డుల వేడుకలో కన్నడ నటులకు అవమానం జరిగిందంటూ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కన్నడ నటులకు అవార్డులు ఇస్తోన్న సమయంలో సడెన్గా లైట్స్ ఆపేశారని.. అక్కడి నటీనటులను వెంటనే వెళ్లిపోవాలని చెప్పి అవమానించారని శారద అనే కన్నడ జర్నలిస్టు చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. అయితే నిజంగానే కన్నడ నటీనటులకు అవమానం జరిగిందా.. ఈ విషయంపై అల్లు అరవింద్ ఎందుకు స్పందించాడు.. సంతోషం అధినేత సురేష్ రియాక్షన్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సీనియర్ సినిమా జర్నలిస్ట్, 'సంతోషం' మ్యాగజైన్ వ్యవస్థాపకుడు సురేష్ కొండేటి.. గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా వార్తలపై కాస్త అవగాహన ఉన్నా.. ఈయన సుపరిచితమే. అయితే ఎన్నో ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన వారికి పురస్కారాలు ఇచ్చి సురేష్ ప్రోత్సహిస్తూ ఉంటారు. అవార్డుల ఫంక్షన్ ఎక్కువగా హైదరాబాద్ లోనే నిర్వహించే వారు.

ఇక ఈ అవార్డుల ఫంక్షన్ కు ప్రతి ఏటా మిగిలిన మూడు ఇండస్ట్రీలకు చెందిన సినీ తారలు ఇక్కడికి వచ్చి హాజరు అయ్యా వారు.ఇక ఈసారి సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల మహోత్సవాన్ని గోవాలో నిర్వహించారు. ఇక ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా... తమిళం, కన్నడ, మళయాళ పరిశ్రమల నుంచి నటీనటులు తరలివెళ్లారు. ఇదంతా బాగున్నప్పటికీ.. కన్నడ నటీనటులకు అవార్డులు ఇచ్చే క్రమంలో పవర్ కట్ అయింది. ఇక్కడే అసలు వివాదం తలెత్తింది.
కన్నడ నటీనటులకు అవార్డులు ఇచ్చే క్రమంలో లైట్స్ ఆపేశారని.. కన్నడ వారిని వెళ్లిపోమ్మారంటూ ఓ కన్నడ జర్నలిస్టు శారద తన ట్విట్టర్ వేదిగా ఓ ట్వీట్ పెట్టారు. దీంతో అక్కడ మొదలైన వివాదం... సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది. అంతే కాదు హోటల్ లో రూమ్లు లేవని, దీంతో చాలామంది తారలు రిసెప్షన్ ఏరియాలో ఉండిపోయారంటూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.
ఇక ఈ వీడియోలు, ఆమె ట్వీట్లు చూసిన కన్నడ ప్రేక్షకులు.. అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో సంతోషం అధినేత సురేష్ కొండేటిపై ఫైర్ అయ్యారు. ఇక సంతోషం సురేష్ అంటే చాలా మందికి మెగా పీఆర్వో అనే విషయం తెలుసు. ఇక అన్ని వార్త పత్రికల్లో.. వెబ్ సైట్స్ లో మెగా స్టార్ చిరంజీవి పీఆర్వో.. కన్నడ నటీ నటులను అవమానించారంటూ వార్తలు వచ్చాయి. దీంతో అల్లు అరవింద్ ఎంట్రీ ఇచ్చారు.

మెగా పీఆర్వో అని చెప్పుకుంటున్న సురేష్ కొండేటికి మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలను నమ్మవద్దని.. సూచించారు. మరోవైపు సురేష్ కొండేటి కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. తనపై కొంతమంది కావాలనే తనపై బురద జల్లుతున్నారని ట్విట్టర్ వేదికగా ఓ నోట్ షేర్ చేశారు. ట్వీట్ లో సంతోషం సురేష్ రాస్తూ.. గత 21 సంవత్సరాలుగా సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను . ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. తెలుగు ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు.. ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను అంటూ వెల్లడించారు.
ఆ ట్వీట్ లో ఇంకా ఏం రాసుందంటే... నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే . అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను. గోవా ఈవెంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్ కు రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్లో కొన్ని పొరపాట్లు జరగడం సహజం. ఇది ఉదేశ్య పూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా క్షమాపణలు చెప్తున్నా. నా మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి' అంటూ ట్వీట్టర్ లో రాసుకువచ్చారు.


Click it and Unblock the Notifications











