సుశాంత్ సింగ్ సూసైడ్: పోలీసుల దూకుడు.. మళ్లీ ఆ ఇద్దరి విచారణ.. ఆ మూడు రోజుల్లో ఏం జరిగింది?
సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకొన్నది. ఇటీవల కాలంలో ఈ కేసులో ముంబై పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. విచారణలో మరింత పురోగతిని ప్రశ్నించేందుకు అనుమానం, అవసరమైన వ్యక్తులను మళ్లీ విచారించేందుకు సిద్ధమవుతున్నారు. తాజా దర్యాప్తుకు సంబంధించిన వివరాలు ఆసక్తిగా మారాయి. ఈ కేసు విచారణకు సంబంధించిన మరిన్ని విషయాలు..

ఈ లోకం వీడి 30 రోజులు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నెల రోజులు పూర్తి కావడంతో బాలీవుడ్ ప్రముఖులంతా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాజీ ప్రేయసి అంకితా లోఖండ్, రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేష్ చాబ్రా, నటుడు శేఖర్ సుమన్ లాంటి వాళ్లంతా ఘనంగా నివాళులర్పించారు. సుశాంత్ సింగ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. కొవ్వొత్తుల వెలిగించి శ్రద్దాంజలి ఘటించారు.

ఆ మూడు రోజుల్లో ఏం జరిగిందనే కోణంలో
జూన్ 14వ తేదీన బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ మరణించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ముంబై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జూన్ 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య ఏం జరిగిందనే విషయంపై బాంద్రా పోలీసులు దృష్టిపెట్టారు. ఆ మూడు రోజుల్లో జరిగిన వ్యవహారాలు అనుమానాస్పదంగా మారడంతో ఆ మూడు రోజులు దర్యాప్తులో కీలకంగా మారాయి.

వంట మనిషిని మరోసారి ప్రశ్నించేందుకు
సుశాంత్ కేసులో కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకని నేపథ్యంలో ఇంట్లో పనిచేసే వంటమనిషిని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. సుశాంత్కు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకొవాలని నిర్ణయించారు. మరణానికి ముందు సుశాంత్ పరిస్థితి ఎలా ఉంది? ఆ మూడు రోజుల మధ్యకాలంలో సుశాంత్ ఏం తిన్నాడు? ఆయన రోజువారీ వ్యవహారాలు ఎలా ఉండేవి? మరణానికి ముందు సుశాంత్కు సంబంధించిన ప్రతీ క్షణాన్ని అడిగి తెలుసుకోవాలని నిర్ణయించారు.

ఇప్పటికే 6 గంటలపాటు వంటమనిషిని
ఇప్పటికే సుశాంత్ వంట మనిషి నీరజ్ను ఓ దఫా ప్రశ్నించారు. గతంలో దాదాపు 6 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. దర్యాప్తు సందర్భంగా కొందరు చెప్పిన విషయాలకు పొంతన లభించకపోవడంతో మళ్లీ నీరజ్ను ప్రశ్నించి వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకొన్నారు. త్వరలోనే నీరజ్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈసారి నీరజ్ను మరింత లోతుగా ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

సుశాంత్ సోదరిని ప్రశ్నించేందుకు
ఇక ముగింపు దర్యాప్తు సందర్భంగా సుశాంత్ సింగ్ సోదరి మితూను కూడా కలిసి విచారించాలని ముంబై పోలీసులు నిర్ణయించారని జాతీయ మీడియా మంగళవారం ఓ కథనాన్ని ప్రచురించింది. గత మూడు నెలల్లో సుశాంత్ ఏం మాట్లాడారు? ఎలాంటి విషయాలను ప్రస్తావించారు? రియా చక్రవర్తితో రిలేషన్ గురించి ఎంత వరకు తెలుసు? వారిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అనే విషయాలను సోదరిని అడిగి తెలుసుకోవాలని బాంద్రా పోలీసులు నిర్ణయించారని తెలిసింది.
Recommended Video

గత నెలరోజుల్లో 35 మందిని
గత నెలరోజులుగా జరిగిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసులో దాదాపు ఇప్పటి వరకు 35 మందికిపైగా ప్రముఖులను ఈ కేసులో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, శేఖర్ కపూర్, రియా చక్రవర్తి, యష్ రాజ్ ఫిలింస్తోపాటు దిల్ బేచారా దర్శకుడు ముఖేష్ చాబ్రాను, హీరోయిన్ సంజనా సంఘీని ప్రశించిన సంగతి తెలిసింది.


Click it and Unblock the Notifications











