Chiranjeevi: తమిళ నటుడికి క్షీణించిన ఆరోగ్యం.. లక్షల్లో చిరంజీవి సాయం, ఎమోషనల్ వీడియో వైరల్!
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేం. స్టార్ రేంజ్ లో వెలుగు వెలిగిన వారే దీన స్థితిలో బతుకు వెల్లదీసే పరిస్థితి వస్తుంది. అలా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక సతమతం అవుతున్న నటుడు పొన్నాంబళం. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు పొన్నాంబళం. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోల పక్కన విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. తమళంతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో ప్రతినాయకుడిగా అలరించారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి సాయమందించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తాజాగా చెప్పుకొచ్చారు.

నిజమైన మెగాస్టార్ గా..
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యారు. కొంతకాలం రాజకీయాలతో సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తనదైన మ్యానరిజంతో అలరిస్తున్నారు. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ సమస్యల పరిష్కారం, నటీనటుల ఆర్థిక, ఆరోగ్య అవసారలకు సాయం అందిస్తూ నిజమైన మెగాస్టార్ అనిపించుకుంటున్నారు.

వరుస సినిమాలతో..
వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న చిరంజీవి గతేడాది ఆచార్యతో ప్లాప్ అందుకోగా.. గాడ్ ఫాదర్ మూవీతో మంచి హిట్ కొట్టారు. ఇక ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్యగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు మహానటి కీర్తి సురేష్ చెల్లెలుగా నటించనున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా అజిత్ నటించిన విశ్వాసం సినిమాను కూడా రీమేక్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఆర్థిక ఇబ్బందుల్లో..
ఇలా సుమారు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చాటుతున్న చిరంజీవి ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందు నిలబడి సాయం అందిస్తారు. ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించి తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ కష్టాలు పడే ఎంతో మందికి సాయం అందిస్తూ చేయూతనిస్తుంటారు. ఇలా సహాయం అందుకున్న వాళ్లలో పావల శ్యామల, గుండు హనుమంతరావు, డ్యాన్స్ మాస్టర్ శివశంకర్, పొట్టి వీరయ్య, సినిమాటోగ్రాఫర్ పి దేవరాజ్ ఉన్నారు.

ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి..
తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తమళ నటుడిగా మంచి ఫేమ్ సంపాదించుకున్న పొన్నాంబళం గతంలో తీవ్ర కిడ్నీ సమస్యతో బాధపడేవారు. రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో చాలా కాలంగా అనారోగ్యాగనికి గురయ్యారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులను సాయం కోరారు పొన్నాంబళం.

కొద్దిసేపటికే ఫోన్ చేసి..
తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక, ధనుష్, కెఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్ తదితర నటులు పొన్నాంబళానికి ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడి విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితి బాలేనప్పుడు, ఎవరిని అడగాలో తెలియక తన స్నేహితుడు ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఫోన్ నెంబర్ తీసుకుని 'అన్నయ్య నాకు బాగోలేదు. మీకు చేతనైనా సాయం చేయండి' అని మెసేజ్ పెట్టానని పొన్నాంబళం చెప్పారు. తాను మెసేజ్ పెట్టిన కొద్దిసేపటికి చిరంజీవి ఫోన్ చేసినట్లు తెలిపారు.
అస్సలు ఊహించలేదు..
చిరంజీవి స్వయంగా కాల్ చేసి నేను ఉన్నాను. "నువ్వు త్వరగా చెన్నైలో నీకు దగ్గర్లో ఉన్న అపొలో హాస్పిటల్ కి వెళ్లు. లేదా హైదరాబాద్ కు వచ్చేయి. నేను చూసుకుంటాను అని అన్నారు. నేను ఒక లక్షో, రెండు లక్షలో ఇస్తారనుకుంటే.. ఎంట్రీ ఫీస్ కూడా తీసుకోలేదు. మొత్తం రూ. 40 లక్షల వరకు ఖర్చు అయింది. అదంతా ఆయనే చూసుకున్నారు. చిరంజీవి గారు అలా సాయం చేస్తారని అస్సలు ఊహించలేదు" అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు నటుడు పొన్నాంబళం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











