పవన్ ఇంకా మారలేదు, వాళ్లంతా ఓట్లేస్తారా.. చిరంజీవితో పోలుస్తూ తమ్మారెడ్డి హాట్ కామెంట్స్!
పవన్ కళ్యాణ్ సినిమాలకు స్వస్తి చెప్పి ఏడాదికి పైగా గడుస్తోంది. ప్రస్తుతం పవన్ జనసేన పార్టీ అధినేతగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందని పవన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఉన్నాక విమర్శలు తప్పకుండా ఎదురవుతాయి. తాజాగా టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పవన్ ని విమర్శిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కలిసొచ్చే అంశాలు
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దత్తు వలనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రతి నియోజకవర్గంలోని సమస్యలని ఎత్తి చూపుతున్నారు. అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇలాంటివన్నీ జనసేనకు కలిసొచ్చే అంశాలు అని తమ్మారెడ్డి అన్నారు. కానీ గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.

ఇంకా మారలేదు
చిరంజీవి నలుగురితో చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. ఆ క్రమంలో చిరంజీవి కాస్త మెతకవైఖరి అవలంభించారు. దాని వలనే ప్రజారాజ్యం ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ చిరంజీవి ఏ పని చేసినా నలుగురితో చర్చించే అలవాటు ఉంది. మెతకగా ఉన్నప్పటికీ ఆ మెతకతనమే ఆయన్ని మెగాస్టార్ ని చేసింది అని తమ్మారెడ్డి అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ లో ఆ గుణం లేదు. మీరు చిన్నప్పటినుంచి మొండిగానే ఉన్నారు. ఇప్పటికి మారలేదు. రాజకీయాల్లో ఈ వైఖరి సరైనదేనా అని తమ్మారెడ్డి పవన్ ని ప్రశ్నించారు.

అనేక వ్యూహాలు
మీరు ప్రత్యేక హోదా సహా అన్ని అంశాల గురించి పోరాడుతున్నారు. పోరాటం చేసే సమయంలో వ్యూహాలు కూడా అనుసరించాలి. ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారా.. తెలుకోకపోతే జగన్, చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల్లో చిక్కుకుపోతారని తమ్మారెడ్డి పవన్ ని హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేసేందుకు అంతా వైజాగ్ కు రావాలని పిలుపునిచ్చారు. నేను కూడా వెళ్ళాను అని తమ్మారెడ్డి అన్నారు. కానీ మీరు మాత్రం రాలేదు అని తమ్మారెడ్డి విమర్శించారు.

అందరూ ఓట్లు వేస్తారా
ఇక మీ సభలకు భారీ ఎత్తున జనం వస్తున్నారు. వారంతా మీకు ఓట్లేస్తారో లేదో గమనించారా. గతంలో చిరంజీవి సభలకు ఇంతకంటే ఎక్కువ జనం వచ్చారు. కానీ వాటన్నింటిని ప్రజారాజ్యం పార్టీ ఓట్లుగా మలచుకోలేకపోయింది. ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే మీకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని తమ్మారెడ్డి పవన్ కళ్యాణ్ ని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











