‘‘మహానటిలో చూపిందంతా నిజం కాదు, ఈ గొడవలు ఆపండి ప్లీజ్’’
Recommended Video

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' విడుదల తర్వాత జెనిమీ గణేశన్ మొదటి భార్య కూతుర్లు మీడియా ముందుకొచ్చి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమ తండ్రిని తప్పుగా చూపించారని గొడవ చేయడం, దీనికి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కౌంటర్ ఇవ్వడంతో అప్పటి వరకు జనాల్లో 'మహానటి' సినిమాపై ఉన్న అభిప్రాయాలు మారడం ప్రారంభం అయింది. ఈ పరిణామాలపై తెలుగు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ గొడవతో కాస్త బాధేసింది
మహానటి తర్వాత మేమంతా తలెత్తుకుని తిరుగుతున్నాం. తెలుగులో మరో మంచి సినిమా వచ్చింది. మాకు ఒక మంచి డైరెక్టర్ దొరికాడు అని ఆనందపడ్డాం. జనం కూడా సినిమాకు నీరాజనాలు పలకడంతో చాలా సంతోషం కలిగింది. ఈ పరిస్థితుల్లో జెమినీ గణేశన్ పిల్లలు మా నాన్నను అసహ్యంగా చూపించారని రకరకాలుగా ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చి గొడవ చేయడం బాధేసింది అని తమ్మారెడ్డి తెలిపారు.

‘మహానటి' చూసి నేనూ డిసప్పాయింట్ అయ్యా
నిజానికి ఈ చిత్రంలో జెమినీ గణేశన్ను చాలా ఎలివేట్ చేసి చూపించారు. నాకు సావిత్రి పర్సనల్ గా తెలుసు. వారి పెళ్లి సమయానికి నేను చిన్నవాడిని అయినా... అప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. చాలా సినిమాలు సారథి స్టూడియోలో చేశారు. ఆ సమయంలో మా నాన్నగారు అక్కడ మేనేజర్గా ఉండేవారు. మా ఉద్దేశ్యంలో.... ఆమె పరిచయం ఉన్న మాలాంటి వారు కూడా జెమినీ గణేశన్ విలన్ అనే అనుకునే వాళ్లం. నిజానికి మహానటి సినిమా చూసిన తర్వాత చాలా డిసప్పాయంట్ అయ్యాను. జెమినీ గణేశన్ వల్లే సావిత్రి ఇండస్ట్రీలోకి వచ్చింది అన్నట్లుగా చూపించారు. ఒక వేళ అది నిజం అయినా కానీ అది ఉండి ఉండక పోతే బావుండేది అనేది నా ఆలోచన. నాగాశ్విన్ అలా ఆలోచించాడు కాబట్టే ఇది సూపర్ హిట్టయింది.... అని తమ్మారెడ్డి తెలిపారు.

ఇది నిజమైన బయోపిక్ కాదు
నేను చెప్పేది ఏమింటే... నాగాశ్విన్ చాలా చిన్నకుర్రాడు. సావిత్రి చనిపోయాక పుట్టిఉంటాడు. అలాంటి కుర్రాడు ఒక ఆలోచనతో సినిమా తీశాడు. అతడికి అందిన సమాచారం, కొంత మంది చెప్పిన వివరాలతోను కథగా అల్లుకుని చేశాడు. అది నిజమైన బయోపిక్ అనుకుని మాకు అన్యాయం జరిగింది అని మీరు కొట్టుకోనవసరం లేదు. సావిత్రిని మహా అద్భుతంగా చిత్రీకరించారు. ఒక గ్రేటెస్ట్ సోల్ గా చూపించారు. జెమినీ గణేశన్ను కూడా బాగా చూపించారు. ఒకటి రెండు సన్నివేశాలు తప్ప ఆయన్ను అన్ని సీన్లలో పాజిటివ్ గా చూపించారు. ఆయనే సావిత్రిని గైడ్ చేశాడు అనే విధంగా ఎలివేట్ చేశారు. ఈ విషయాన్ని జెమినీ గణేశన్ కూతుర్లు గమనించాలి... అని తమ్మారెడ్డి సూచించారు.

అలా తీస్తే ఎవరూ చూడరు
బయోపిక్ అంటే ఉన్నది ఉన్నట్లుగా తీయడం. కానీ అలా తీస్తే జనాలు చూడరు. దానికి సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకున్నపుడే ఆడుతుంది. ఈ సినిమాలో కొన్ని పెద్ద విషయాలను చిన్నగా, చిన్న విషయాలను పెద్దగా ఎలివేట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు. సినిమాలో కొన్ని చూపించకూడనివి కూడా ఉన్నాయి. అయితే వాటిని పట్టుకుని మా నాన్నను తప్పుగా చిత్రీకరించారని ఆరోపించడం సరికాదు. జెమినీ గణేశన్ మొదటి భార్యను కూడా ఇందులో ఎంతో గొప్ప మనసున్న వ్యక్తిగా చూపించారు.... అని తమ్మారెడ్డి అన్నారు.

మీరు విడిపోవడం ఇష్టం లేదు
జెమినీ గణేశన్ కూతుర్లంతా కలిసి దిగిన ఫోటో ఇటీవల ఇంటర్నెట్లో చూశాను. చూడగానే ఎంతో ముచ్చటేసింది. అంతా కలిసి ఉన్నారు. కానీ మహానటి విడుదల తర్వాత ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం బాగోదు. సినిమా సినిమాగానే చూడండి. మహానటిలో సావిత్రి గురించి మంచిగా చెప్పారు, పిల్లలైన మిమ్ములను గురించి, మీ తల్లుుల గురించి మంచిగా చెప్పారు. ఒక మంచి సినిమా చూశాము అనుకోవాలే తప్ప అనవసరంగా పోట్లాడుకోవడం సరికాదు. ఇప్పటిదాకా కలిసున్న మీరు విడిపోవడం కూడా మాకు ఇష్టం లేదు అని తమ్మారెడ్డి తెలిపారు.


Click it and Unblock the Notifications











