టార్గెట్ పవన్! ప్లానింగుతో సాగుతున్న మహేష్బాబు!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం భారీ వసూళ్లు సాధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను టాప్ పొజిషన్లో నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం అసాధ్యమనుకున్న రికార్డులు బద్దలుకొట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ను రికార్డులను అందుకునే ఏకైక హీరో ప్రస్తుతం మహేష్ బాబే అనేది పలువురి అభిప్రాయం.
ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1-నేనొక్కడినే' అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు ముందే చేస్తున్న బిజినెస్ చూస్తుంటే.....పవన్ కళ్యాణ్ రికార్డులను అందుకోవడం సాధ్యమే అనే అభిప్రాయం కలుగుతోంది. అందుకోసం గాను ఆ చిత్ర నిర్మాతలు ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు సాగుతున్నారు. ముందస్తుగా అత్యధిక సంఖ్యలో థియేటర్లను బుక్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పటికే '1' చిత్రం పలు ఏరియాల్లో థియేట్రికల్ రైట్స్ విషయంలో 'అత్తారింటికి దారేది' చిత్రానికి ఏమాత్రం తీసిపోకుండా బిజినెస్ చేస్తోంది. నెల్లూరు ఏరియాలో ఇప్పటికే '1' మూవీ ప్రీ రిలీజ్ బిజినెన్ 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని క్రాస్ చేసింది. ఈ లెక్కలు సినీ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇక తెలుగు సినిమాకు ముఖ్యమైన రాబడి కేంద్రంగా మారిన ఓవర్సీస్ ఏరియాలో మహేష్ బాబు సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ ఏరియాలో కూడా '1' చిత్రాన్ని భారీగా 200 స్క్రీన్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మహేష్ బాబు.....అంచనాలను ఏమేరకు అందుకుంటాడు అనేది త్వరలోనే తేలనుంది.


Click it and Unblock the Notifications