టాక్సీవాలా మూవీ లీక్.. విజయ్ దేవరకొండకు షాక్.. తమిళ రాకర్స్ వెబ్సైట్లో..
సినీ పరిశ్రమపై పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. ప్రముఖ హీరో సినిమాలను రిలీజ్ రోజే లీక్ చేసి ఆన్లైన్లో పెట్టే తమిళ రాకర్స్ పైరసీ వెబ్సైట్ మరోసారి తన ప్రతాపాన్ని టాలీవుడ్పై చూపించింది. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రాన్ని రిలీజ్కు ముందే ఆన్లైన్లో పెట్టేసింది. దాంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ షాక్ గురైంది. వివరాల్లోకి వెళితే..

రిలీజ్కు ముందే లీక్
గీతా గోవిందం, నోటా చిత్రాలతో విజయ్ దేవరకొండ దూసుకెళ్తున్నాడు. నోటా ఆశించనంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆశలన్నీ టాక్సీవాలాపై పెట్టుకొన్నాడు. ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన రిలీజ్కు సిద్దమవుతున్నది. ఈ నేపథ్యంలో హై డెఫినేషన్ (హెచ్డీ) క్వాలిటీ సినిమా తమిళ రాకర్స్ వెబ్సైట్లో దర్శనమిచ్చింది.

తమిళ్ రాకర్స్ వెబ్సైట్ దుశ్చర్య
రిలీజ్కు ముందే టాక్సీవాలా తమిళ రాకర్స్ లీక్ చేయడం టాలీవుడ్లో సంచలనం రేపింది. గతంలో అత్తారింటికి దారేది సినిమా కూడా రిలీజ్కు ముందే లీక్ అయింది. కానీ ఏకంగా వెబ్సైట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనే ఆప్షన్ ఇవ్వలేదు. ప్రస్తుతం టాక్సీవాలా ఉదంతం నిర్మాతలకు వెన్నులో చలిపుట్టిస్తున్నది.

టాలీవుడ్ నిర్మాత బెంబేలు
కోట్లాది రూపాయలు పెట్టి సినిమా తీస్తే రిలీజ్ కాకుండానే పైరసీ బారిన పడటంతో నిర్మాతలు బెంబేలెత్తుతున్నారు. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే మా గతి ఏం కావాలనే మాట వినిపిస్తున్నది. ప్రస్తుతం టాక్సీవాలా లింక్ను తమిళ్ రాకర్స్ నుంచి తొలగించే ప్రయత్నాలు చేపడుతున్నారు.

టాక్సీవాలాను వెంటాడుతున్న పైరసీ
గీతా గోవిందం సినిమా క్లిప్స్ లీకైన సమయంలో టాక్సీవాలా కూడా లీక్ అయింది. కాకపోతే వెంటనే హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకొని నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కానీ ప్రస్తుత ఏకంగా వెబ్సైట్లోనే వచ్చిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ అభిమానులకు పిలుపునిచ్చాడు. పైరసీ సినిమాను చూడవద్దు. వీఎఫ్ఎక్స్ తో కూడిన సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని అభిమానులను కోరారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఎస్కేఎన్ నిర్మాతగా
గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా టాక్సీవాలాను రూపొందించాయి. ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ సాంక్రిత్యన్. నూతన నిర్మాత ఎస్కేఎన్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్గా నటిస్తున్నది. దెయ్యం ఆధీనంలో ఉండే కారు కథతో ఈ సినిమా రూపొందింది.

2.O తమిళ రాకర్స్ సవాల్
ఇదిలా ఉండగా, 2.O చిత్రాన్ని కూడా త్వరలో తమిళ్ రాకర్స్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తామని హెచ్చరించారు. దాంతో శంకర్, సన్ టీవీ యాజమాన్యం ముందే మేల్కొంది. పైరసీ బారిన పడుకుండా 2.O గురించి సరైన జాగ్రత్తలు తీసుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











