పవన్ కళ్యాణ్ని కొనే శక్తి ఎవరికీ లేదు..ఆయన తలచుకొంటే 2014 లోనే: టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వైసీపీ నేతలు విమర్శించాల్సి వచ్చినప్పుడు మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ ఆరోపిస్తూ ఉంటారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుంచి ప్యాకేజీ తీసుకుని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉంటారని ఆరోపిస్తారు. కోట్లాది మంది కాపుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టారంటూ దుమ్మెత్తిపోస్తారు. చోటామోటా నాయకుల నుంచి సాక్షాత్తూ వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పవన్ను ఇదే పదజాలంతో విమర్శిస్తూ ఉంటారు.
రాజకీయంగా చేసే విమర్శలను చూసీచూడనట్లుగా వదిలివేసే పవన్ కళ్యాణ్.. ఓ సందర్భంలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చారు. మీడియా సమావేశంలోనే చెప్పులు చూపిస్తూ కోపంతో ఊగిపోయారు పవన్. ఇంకోసారి ప్యాకేజీ అంటే మర్యాదగా ఉండదని, దవడ వాచిపోయేలా కొడతానని హెచ్చరించారు. అయినప్పటికీ వైసీపీ నేతల వైఖరిలో కొంచెం కూడా మార్పు రాలేదు. పవన్పై అవే తిట్లు, అవే కామెంట్లు.

ఇదే అంశంపై స్పందించారు టీడీపీ సీనియర్ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఓ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను .. పవన్ను ప్యాకేజ్ స్టార్ అని పదే పదే వైసీపీ నేతలు విమర్శిస్తారని, అసలు జనసేన అధినేతకు ఎంత ప్యాకేజీ ఇచ్చారు, ఎంతకు కొన్నారని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి నిమ్మల రామానాయుడు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. టీడీపీ, జనసేన కేడర్ను, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే వైసీపీ నేతలు ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారని ఆరోపించారు.
తనకు తెలిసి పవన్ కళ్యాణ్ను కొనే శక్తి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచంలోనే ఎవరికీ లేదని రామానాయుడు అన్నారు. పవన్ నీతిగా, నిజాయితీపరుడిగా ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తని నిమ్మల ప్రశ్నించారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ల కుటుంబాలకు తన సొంత జేబులోంచి లక్షల రూపాయలు డబ్బును ఇచ్చి ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రామానాయుడు ప్రశంసించారు. నిజంగా పదవులు, డబ్బుపై ఆశ ఉంటే 2014లోనే ఆయనకు కావాల్సిన సీటు, పదవి, వెనుదిరిగి చూసుకోలేనంత డబ్బు వచ్చి ఉండేదని పేర్కొన్నారు. పవన్ నీతికి, నిజాయితీకి మారు పేరని.. ఆయన చేసిన త్యాగం వల్లే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశాయని నిమ్మల రామానాయుడు ప్రశంసించారు.

కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు బరిలో నిలిచారు. 2014, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆయన ఈసారి హ్యాట్రిక్పై కన్నేశారు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు నిమ్మల. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వైసీపీ విధానాలపై దుమ్మెత్తి పోయడం, ప్రజా పోరాటాలతో నిమ్మలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.
టీడీపీ కేడర్కు తోడు కాపు సామాజిక వర్గం, జనసేన , పవన్ కళ్యాణ్ అభిమానుల మద్ధతు కూడా లభించడంతో ఈసారి తన గెలుపు ఖాయమని నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వైసీపీ ఆవిర్భావం తర్వాతి నుంచి పాలకొల్లులో గెలవకపోవడంతో ఈసారి తమ జెండా పాతాలని జగన్ భావిస్తున్నారు. పార్టీ తరపున గుడాల శ్రీహరి గోపాలరావును అభ్యర్ధిగా ప్రకటించి అన్ని రకాల సాయం అందజేశారు.


Click it and Unblock the Notifications











