వేడెక్కిన తెలంగాణ: వర్మ సినిమాకు భారీ నష్టం
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంటులో బలవంతంగా ఆర్టినెన్స్ ఆమోదించారంటూ తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, జేఏసీ శనివారం రాష్ట్ర బందుకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ఈ బంద్ ఎఫెక్ట్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'ఐస్ క్రీం' సినిమాపై పడింది.
వాస్తవానికి 'ఐస్ క్రీమ్' నిన్న(జులై 11)న విడుదల చేయాల్సి ఉండగా.....'దృశ్యం' సినిమా కారణంగా విడుదల 12కు వాయిదా వేసారు. తెలుగు సినిమా ప్రధాన ఆదాయం వచ్చేది నైజాం ఏరియా నుండే. అయితే సడన్గా బంద్ పిలుపు రావడం సినిమాను తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల నిలిపి వేసారు. తొలి రోజు కావడంతో భారీ నష్టాలు వచ్చాయి.

మరో వైపు సినిమా ఇతర ప్రాంతాల్లో విడుదలైంది. సినిమాకు ఎక్కడ చూసినా నెగెటివ్ టాకే. దీంతో రేపటి నుండి ఈ సినిమాకు వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం కష్టమే అంటున్నారు. బంద్ లేకుండా ఉంటే తెలంగాణ ప్రాంతంలో సినిమాకు ఓపెనింగ్స్ బాగుండేవని, కానీ పరిస్థితి పూర్తిగా తలక్రిందులైందని నిర్మాతలు లబోదిబో మంటున్నారు.
'ఐస్ క్రీమ్' చిత్రంలో తేజస్వి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని బీమవరం టాకీస్ బేనర్లో తుమ్మలపల్లి సత్యనారాయణ నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











