తెలంగాణ ఆవిర్భావం: రాచకొండలో ఫిలింసిటీ.. కేసీఆర్ అద్భుత ప్రణాళిక.. ఎప్పుడో ముందడుగు!
Recommended Video

ఐదు దశాబ్దాలకుపైగా పోరాటంతో సాకారమైన తెలంగాణ రాష్ట్రం అనూహ్యమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తీసుకొచ్చి అభివృద్దిపై దృష్టిపెట్టింది. కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా ఘనమైన చిరిత్ర ఉన్న రాచకొండ గుట్టలపై దృష్టిపెట్టారు.

రాచకొండ ఘనత ఇదే
రాచకొండను రాజధానిగా చేసుకొని రేచర్ల పద్మనాయకులు తెలంగాణను పాలించారు. అనపోతన లాంటి గొప్ప రాజులెందరో ఈ ప్రాంతం నుంచి పాలన సాగించారు. అత్యంత పటిష్టంగా భారీ ప్రాకారాలు, అద్భుతమైన కోటలు, శత్రు దుర్భేధ్యమైన ప్రహారీలను ఆ కాలంలోనే నిర్మించారు. ఇప్పటికీ ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిసున్నది.

రాష్ట్ర విభజన తర్వాత
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి సినిమా పరిశ్రమ తరలి వెళ్లిపోతుందనే వార్తలతో కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సినీ పరిశ్రమ అంతా ఆంధ్ర ప్రాంత ఆధిపత్యంలో ఉండటంతో వారిని ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారు. అలాగే సినీ వర్గాలకు భరోసా కల్పించే విధంగా ప్రణాళికలు చేపట్టారు. ఆ నేపథ్యంలోనే రాచకొండలో ఫిలింసిటీ తెరపైకి తీసుకొచ్చారు.

సినీ నిర్మాణాలకు రాచకొండ అనుకూలం
రాచకొండ ప్రాంత తెలంగాణ రాజధాని హైదరాబాద్కు సుమారు 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉంది. సినిమా షూటింగులకు అనుకూలంగా ఉన్న ఈ ప్రదేశంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, ఎన్కౌంటర్, ఆగడు, గబ్బర్ సింగ్, సీతారాముల కల్యాణం లంకలో, విరోధి, రెబల్ లాంటి చిత్రాలు షూటింగ్ జరుపుకొన్నాయి.

2 వేల ఎకరాల్లో ఫిలిం సిటీ
రాచకొండ ప్రాంత విశిష్టతను, భౌగోళిక, వాతావారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొన్న సీఎం కేసీఆర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు భారీ ప్రణాళికను చేపట్టారు. సుమారు 35 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంతంలో ఫిలిం, ఫార్మా, ఇతర రంగాలకు చెందిన పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయం తీసుకొన్నారు. ప్రధానంగా 2 వేల ఎకరాల్లో ఫిలిం సిటీని రూపొందించాలనే ప్లాన్తో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు. మూడు జిల్లాల కలెక్షర్లతో సమీక్షలు నిర్వహించారు.

రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
జిల్లా కలెక్టర్ల నివేదికలతో సంతృప్తి పొందిన సీఎం కేసీఆర్ రాచకొండ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. నగరానికి సమీపంలో ఉండటమే కాకుండా, శంషాబాద్ విమానాశ్రాయానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండటం సినిమా పరిశ్రమ అభివృద్ధికి అనుకూలంగా మారింది.

అత్యంత సాంకేతికత పరిజ్ఞానంతో
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సినీ నిర్మాణానికి అవసరమైన అత్యంత అధునాతన సాంకేతిక పరిజానంతో పరికరాలు, వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. రెగ్యులర్ స్టూడియోలతోపాటు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఫిలిం సిటీకి మోక్షం ఎప్పుడో
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం చకచకా ప్రణాళికలు రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత ఫిలింసిటీ నిర్మాణ ప్రతిపాదనలు పక్కన పెట్టినట్టు కనిపిస్తున్నది. ప్రకటనలే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఆచరణ శుద్ది లేదని రాజకీయ వర్గాలు విమర్శలు సంధించాయి. ఒకవేళ రాచకొండలో ఫిలింసిటీ ఏర్పాటు జరిగితే మూడు జిల్లాలకు మంచి వైభవం వచ్చే అవకాశం ఉంటుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ప్రాజెక్ట్కు మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని సినీ వర్గాలు వేచిచూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











