Balagam: కన్నీళ్లు పెట్టిస్తున్న బలగం మొగిలయ్య పరిస్థితి.. కేటీఆర్, డైరెక్టర్ వేణు ఏం చేశారంటే?
జబర్దస్త్ కమెడియన్ టిల్లు వేణు దర్శకుడిగా మారిన చిత్రమే బలగం (Balagam Movie). కమెడియన్ ప్రియదర్శి మరోసారి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్ గా చేసింది. టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ బలగం చిత్రాన్ని నిర్మించింది. మార్చి 3న విడుదలైన బలగం సినిమా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తోపాటు విమర్శల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకుపోతోంది. అయితే ఇందులో క్లైమాక్స్ లో అందరి గుండెల్ని పిండేసే 'తోడుగా మా తోడుండి' అనే పాట పాడిన మొగిలయ్య పరిస్థితి పై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.

మన ఇంట్లో కథగా..
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని కథతో తెరకెక్కిన సినిమా 'బలగం'. ఓ కుటుంబంలో పెద్ద దిక్కు మరణాన్ని ఇతివృత్తంగా చేసుకుని.. అంత్యక్రియలు, దశదిన కర్మ, పిట్టకు పెట్టుడు, ఆత్మీయుల మధ్య సాగే కలహాలు, అనుబంధాలు, మనస్పర్థలు, భావోద్వేగాల వంటి అంశాలతో బ్యూటిఫుల్ ఎమోషనల్ కామెడీ డ్రామాగా ఈ సినిమా వచ్చింది. మన ఇంట్లో కథ అన్నట్లుగా సాగే ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

కన్నీళ్లు రావాల్సిందే..
ఇక 'బలగం' సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే 'తోడుగా మా తోడుండి' అనే పాట ప్రతీ ఒక్కరిని ఏడిపిస్తుంది. ఈ పాటే సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టి కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే ఆ పాట పాడిన గాయకుడు మొగిలయ్య పరిస్థితి తెలిసిన వాళ్లు కూడా కన్నీళ్లు పెట్టక మానరు.

ఇప్పటికే 10 ఆపరేషన్లు..
సింగర్ మొగిలయ్యకు కరోనా వచ్చిన తర్వాత దాని ప్రభావంతో రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. సినిమా తర్వాత కళ్లు కూడా కనిపించట్లేదు. వైద్యం చేయించుకునేందుకు మొగిలయ్య ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. షుగర్, బీపీ వల్ల వైద్యం చేయడం క్రిటికల్ గా మారింది. ఇప్పటికే 10 ఆపరేషన్లు జరిగాయి. దీంతో మొగిలయ్య పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అయితే ఈ విషయం తెలిసి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.

ఎమ్మెల్యేకు ఫోన్ చేసి..
గాయకుడు మొగలియ్య ఆరోగ్యానికి కావాల్సిన వైద్యానికి పూర్తి ఖర్చును ప్రభుత్వం పూర్తి ఉచితంగా జరిపించనున్నట్లు ప్రకటించింది తెలంగాణ సర్కారు. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆయన వైద్య సహాయ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఫోన్ చేసి మరి ఆదేశాలు జారీ చేశారు.

త్వరలో నిమ్స్ ఆస్పత్రికి..
బలగం మొగిలయ్యకు డయాలిసిస్, మెడిసిన్ ఉచితంగా అందించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎల్వోసీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వ పథకం వర్తింపజేయనున్నారు. అంతేకాకుండా మొగలియ్య, కొమురవ్వ దంపతుల ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పాలని బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ సూచించారట. త్వరలో మొగలియ్యను నిమ్స్ ఆస్పత్రికి తరలించనున్నారట.

మరింత ఆర్థిక సాయం..
మొగిలయ్య పరిస్థితిపై మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఆయనకు అన్ని రకాల ట్రీట్ మెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గాయకుడు మొగిలయ్యకు బలగం సినిమా డైరెక్టర్, కమెడియన్ వేణు యెల్దండి రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. అలాగే త్వరలో అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి కూడా మొగిలయ్యకు ఆర్థిక సాయం అందనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











