సమంత సినిమాను చూసిన గవర్నర్.. చిత్ర యూనిట్కు ప్రశంసలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత నటించిన తాజా చిత్రం 'ఓ బేబీ'. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. మిగిలిన సినిమాల నుంచి పోటీని తట్టుకుని విజేతగా నిలిచింది. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా దూకుడును ప్రదర్శించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టిన 'ఓ బేబీ'.. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్గా తెరకెక్కింది.
దీనికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించగా, సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్లు నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్గా పని చేశారు.

ఇందులో సమంతతో పాటు సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. వీరితో పాటు నాగ శౌర్య, తేజ, రావు రమేష్, అడవి శేష్, జగపతి బాబు తదితరులు నటించారు. తాజాగా ఈ సినిమాను తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కుటుంబ సమేతంగా చూశారు. నగరంలోని రామానాయుడు స్టూడియోలో ఉన్న ప్రత్యేక స్క్రీన్లో చిత్ర యూనిట్ సినిమాను ప్రదర్శించింది.
అంతకు ముందు గవర్నర్కు చిత్ర యూనిట్ ఘన స్వాగతం పలికింది. వీరిలో నందినీ రెడ్డి, నిర్మాతలు, యాక్టర్ తేజ తదితరులు ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత నరసింహన్.. చిత్ర యూనిట్ను ప్రశంసించారు. హీరోయిన్ సమంతతో పాటు మిగిలిన వారంతా చక్కగా నటించారని చెప్పారు. అలాగే, నందినీ రెడ్డి డైరెక్షన్ కూడా బాగుందని అన్నారు.
మరోవైపు, ఈ సినిమా ఇతర భాషల్లోకి రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్లో దీన్ని రీమేక్ చేయడానికి సురేష్ ప్రొడక్షన్స్ ప్రయత్నాలు కూడా ప్రారంభించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











