చిరంజీవికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. అక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశం
స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. అనేక చిత్రాలతో తన వైవిధ్యమైన నటన చూపిస్తూ టాలీవుడ్ లో బాస్ గా మారారు. అప్పట్లో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన చిరంజీవికి అంతగా కలిసి రాలేదు. దీంతో మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవి ఖైదీ నెం 786 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ కొట్టిన మెగాస్టార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారారు. అయితే ఆయనకు తాజాగా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ విజయం..
సుమారు 40 సంవత్సరాలుగా తెలుగు చిత్రసీమలో హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాకా వాల్తేరు వీరయ్యగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు.

మాస్ అవతారంతో..
గతేడాది ఆచార్యతో ప్లాప్ చూడగా.. గాడ్ ఫాదర్ మూవీతో మంచి విజయం అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక 2023 కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్యగా సూపర్ హిట్ కొట్టి మెగా ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ అందించారు. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటించిన ఈ చిత్రంలో వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారంతో చిరంజీవి కనిపించిన విషయం తెలిసిందే.

ఓటీటీలోనూ..
వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన మార్క్ చూపించాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత అన్నదమ్ములుగా చిరంజీవి, రవితేజ నటించడంతో సినిమాపై మంచి హైప్ పెరగ్గా.. ఆ అంచనాలను అందుకుని సాలిడ్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న వాల్తేరు వీరయ్య చిత్రం ప్రస్తుతం ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది.

హైకోర్టు తీర్పు..
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ హైకోర్టు మెగాస్టార్ చిరంజీవికి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు చిరంజీవిని ఆదేశించింది. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో నిర్మాణం చేపట్టరాదని చిరంజీవితోపాటు జూబ్లీహిల్స్ సొసైటీని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాద స్థలంపై యాథాతథ స్థితి కొనసాగించాలని న్యాయస్థానం సూచించింది.

నిబంధనలకు విరుద్దంగా..
ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు కేటాయించిన 595 గజాల స్థలాన్ని చిరంజీవికి జూబ్లీహిల్స్ సొసైటీ విక్రయించిందని జె. శ్రీకాంత బాబు, తదితరులు పిటిషన్ వేశారు.హైకోర్టులో మంగళవారానికి వచ్చిన ఈ పిటిషన్ పై విచారించింది. ఆ స్థలాన్ని జీహెచ్ఎంసీ గతంలోనే స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని చిరంజీవికి విక్రయించారని పిటిషన్ పేర్కొన్నారు.

అప్పటికి వాయిదా..
ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన స్థలాన్ని కొనుగోలు చేసి అందులో చిరంజీవి నిర్మాణం చేపట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ, జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.


Click it and Unblock the Notifications











