మహేష్ బాబు సెట్ దహనం..నష్టం ఎంతంటే
మహేష్ బాబు తాజా చిత్రం 'కిలాడీ' కోసం భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన సినిమా సెట్టింగ్లను తెలంగాణా ఆందోళనకారులు నిన్న(గురువారం) ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ దహనకాండలో రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు తేలింది. రాజస్థాన్ లోని పూర్తి గ్రామీణ వాతావరణాన్ని తలపించే రీతిలో నెలరోజులకు పైగా శ్రమించి ఈ భారీ సెట్టింగ్ను నిర్మించారు. సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో ఓ గ్రామం, అందులో రాజస్థాన్ సంస్కృతిని ప్రతిబించేలా ఈ సెట్టింగ్లు నిర్మాణమయ్యాయి. రోజూ రాత్రి వేళల్లో షూటింగ్ చిత్రీకరణ సాగుతోంది. గత వారం రోజులుగా మహేష్బాబు, అనుష్కలపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు సన్నివేశాలను ఆక్కడ చిత్రీకరించారు. గురువారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు అక్కడకు చేరుకున్నారు. సెట్టింగ్లను విచ్చలవిడిగా ధ్వంసం చేశారు. ఏ సెట్టింగ్ను వదలకుండా చెల్లాచెదురు చేశారు.
అంతటితో ఆగకుండా నిప్పంటించారు. దీంతో ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగతో నిండిపోయింది. భారీ జనరేటర్, డీసీఎం, టాటా సుమోలకు కూడా నిప్పంటించారు. దీంతో జనరేటర్ భారీ శబ్దంతో పేలిపోయింది. వాహనాలు చాలా సేపటి వరకు కాలుతూ కనిపించాయి. సంఘటన స్థలంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించినా ఫలితం లేకుండాపోయింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం గిరిగెట్పల్లి శివారులో ఈ సంఘటన చోటుచేసుకుంది.సెట్ ధ్వంసం కావటం,అక్కడ చిత్రీకరించాల్సిన సీన్స్ ఇంకా పెండింగ్ ఉండటంతో నిర్మాత సింగనమల రమేష్ తలపట్టుకు కూర్చున్నారు. అసలే చిత్ర పరిశ్రమ వరస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవటంతో మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా మారిందని పరిశ్రమలోని వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











