ఎవడు వాయిదా : పవన్ కళ్యాణ్ కాదు తెలంగాణ?
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా రూపొందిన 'ఎవడు' మూవీ గతంలో జులై 31న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఉన్నట్టుండి విడుదల తేదీ మార్చారు. ఏకంగా 20 రోజులు వాయిదా వేసి....ఆగస్టు 21న విడుదల చేయాలని నిర్ణయించారు.
మొదట్లో అంతా ఈ వాయిదాకి కారణం పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' అని అంతా అనుకున్నారు. కానీ అసలు విషయం అదికాదని, తెలంగాణ ఏర్పాటు అంశం ముందే పసిగట్టిన కేంద్రమంత్రి, రామ్ చరణ్ తండ్రి అయిన చిరంజీవి ఈ సినిమా విడుదలను వాయిదా వేయించారనే ప్రచారం ఫిల్మ్ నగర్లో సాగుతోంది.
చిరంజీవి వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వాడు. గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయన ఫ్యామిలీ హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. 2010లో వచ్చిన ఆర్య 2 ఈ పరిస్థితికి బెస్ట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య 2 చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే తెలంగాణ ఆందోళనల కారణంగా బాక్సాఫీసు కలెక్షన్ల విషయంలో అంచనాలను అందుకోలేక పోయింది.
చిరంజీవి రాష్ట్ర విభజనకు మొదటి నుండి వ్యతిరేకమే అనే విషయం బహిరంగమే. ఈ నేపథ్యంలో విభజనకు ముందు జరిగిన చర్చల్లో చిరంజీవి కూడా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అధిష్టానం రాష్ట్ర విభజనపై కీలక నిర్ణయం తీసుకోబోతుందనే విషయం గ్రహించారు.

విభజన ‘ఎవడు'కి ఎఫెక్ట్ అవుతుందని గ్రహించారు
రాష్ట్ర విభజన అంశం ముందే గ్రహించిన చిరంజీవి......ముందు జాగ్రత్తగా ‘ఎవడు' సినిమాను వాయిదా వేయించినట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. గతంలో ఆర్య2 సినిమాకు ఏర్పడిన పరిస్థితి ఈ చిత్రానికి రాకూడదనే ఆయన సినిమాను వాయిదా వేయించినట్లు తెలుస్తోంది.

నైజాంలో ఆర్య2 డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే....గతంలో ఆర్య2 చిత్రానికి నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే. ఇప్పుడు ఎవడు సినిమాను నిర్మించినది కూడా దిల్ రాజు. అప్పట్లో తెలంగాణ ఆందోళన కారణంగా ఆర్య2 పంపిణీ దారుడిగా దిల్ రాజు నష్టపోయారు.

ఆర్య2 కలెక్షన్లపై ప్రభావం చూపిన తెలంగాణ ఉద్యమం
అప్పట్లో ఆర్య2 తొలి వారంలో 5 కోట్లు వసూళ్లు సాధించింది. అందులో 75 శాతం కలెక్షన్ నైజాం ఏరియా నుండే. అయితే రెండో వారం బిజినెస్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. బన్నీకి చిరంజీవితో ఉన్న రిలేషన్ కారణంగా తెలంగాణ ప్రాంతంలో సినిమా ప్రదర్శన కాకుండా అడ్డుకున్నారు.

సీమాంధ్ర సెంటిమెంట్ గ్రహించిన దిల్ రాజు
రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రజలు అప్ సెట్ అవుతారని, ఈ సమయంలో ఎవడు రిలీజ్ చేస్తే సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర బేనర్ పై నిర్మించిన దిల్ రాజు ముందస్తుగానే గ్రహించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ సెంటిమెంట్స్
విభజన జరిగిన తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ....మళ్లీ ఏమైనా అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే తెలంగాణలోనూ సినిమాకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని దిల్ రాజు గ్రహించారు. రామ్ చరణ్కు సీమాంధ్రకు లింకు ఉండటమే ఇందుకు కారణం.

ఎవడు రిలీజ్ వాయిదా
ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత నిర్మాత దిల్ రాజు సినిమా విడుదలను వాయిదా వేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు దాదాపు రూ. 35 కోట్లు వెచ్చించి నిర్మించారు. జులై 31 నుంచి ఆగస్టు 21కి ఈచిత్రాన్ని వాయిదా వేసారు.

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ
తెలంగాణ ప్రకటన ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడింది. దాదాపు నాలుగైదు నెలల్లో రాష్ట్రాన్ని రెండుగా విభజించి రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 21న విడుదల కాబోతున్న ‘ఎవడు' చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలను సాధిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

బాక్సాఫీసు వద్ద ఎవడు అదృష్టం ఎలా ఉందో?
సినిమా ఎంత గొప్పగా ఉన్న, ప్రేక్షక రంజకంగా ఉన్న ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అదృష్టం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. మరి ఎవడు అదృష్టం ఎలా ఉందో చూడాలి.


Click it and Unblock the Notifications











