ఆర్టీసీ బస్సు, సుదర్శన్ థియేటర్, మెగాస్టార్ కటౌట్.. మూడింటికి లింక్, సజ్జనార్ వాడకం వేరే లెవల్..!!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీ రూపురేఖలు మార్చేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో విడతలవారీగా బస్సులను తీసుకొస్తున్నారు. ఆదాయ మార్గాలను పెంచి ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు పథకం ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు కావడంలో సజ్జనార్ది కీలకపాత్ర.
ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో దశలవారీగా 2,375 బస్సులను ప్రవేశపెడతామని సజ్జనార్ ప్రకటించారు. మహాలక్ష్మీ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే ఆర్టీసీ సమర్ధవంతంగా అమలు చేసిందని.. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతోందని సజ్జనార్ వెల్లడించారు. ప్రతిరోజు సగటున 27 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని.. కొత్తగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ను చేపడతామన్నారు.

ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు సజ్జనార్ వినూత్న మార్గాలను ఆన్వేషిస్తున్నారు. ఇందుకోసం సినిమాలను, సినీనటులను ఆయన ఎంచుకుంటున్నారు. సైబరాబాద్ సీపీగా ఉన్న రోజుల్లోనూ ట్రాఫిక్పై అవగాహన కల్పించేందుకు ఆయన స్టార్ హీరోలతో ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు హీరోలు, హీరోయిన్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన సన్నివేశాలను కట్ చేసి వాటిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు.
దృశ్యం సినిమాలో హీరో వెంకటేష్, అరవింద సమేతలో ఎన్టీఆర్లు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిన వీడియోలను పంచుకుని మీరు కూడా సురక్షితంగా, సుఖవంతంగా ఆర్టీసీలో ప్రయాణించాలని సజ్జనార్ రిక్వెస్ట్ చేశారు. తాజాగా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఆయన బ్లాక్బస్టర్ మూవీ ఇంద్రను 4కే వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 థియేటర్లలో ఇంద్రను రీ రిలీజ్ చేశారు. దీంతో తెలుగునాట మెగా అభిమానులు సందడి చేశారు. చిరంజీవి భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి తీన్మార్ డ్యాన్సులు, బాణాసంచా కాల్చారు. మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులకు స్వీట్లు పంచిపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భాన్ని కూడా సజ్జనార్ ఉపయోగించుకున్నారు. ఇబ్బందులు, అవాంతరాలు లేని ప్రయాణం కోసం టీజీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మీ దగ్గరలోని థియేటర్లో ఇంద్ర రీరిలీజ్ మేనియాలో చేరండి అంటూ తెలంగాణ ఆర్టీసీ ట్వీట్ చేసింది. టీజీఎస్ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లోకేషన్ మార్క్, బ్యాక్గ్రౌండ్లో మెగాస్టార్ చిరంజీవి కటౌట్ ఉన్న పోస్టర్ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోండగా.. సజ్జనార్ వాడకాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











