Thalapathy Vijay 66: వంశీ-దిల్ రాజు ప్రాజెక్ట్ ప్రారంభం.. 20 ఏళ్ళలో రాని కధతో ప్రేక్షకుల ముందుకు?
తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ స్టార్ డమ్ గురించి సగటు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ గత సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రికార్డులను బద్దలు కొట్టాయి అంటే అతిశయోక్తి కాదు. అలా ఆయన అత్యంత డిమాండ్ ఉన్న కోలీవుడ్ స్టార్లలో ఒకరిగా మారిపోయాడు. ఇక ఈ మధ్య తెలుగు హీరోలు-తమిళ దర్శకులు, తమిళ హీరోలు-తెలుగు దర్శకుల కాంబోలు కుదురుతున్న క్రమంలో వంశీ పైడిపల్లి విజయ్తో ఒక ద్విభాషా సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా అధికారికంగా ప్రారంభించారు. ఆ వివరాల్లోకి వెళితే

విజయ్ హీరోగా
దళపతి విజయ్ సినిమాలు కోలీవుడ్లోనే కాకుండా సౌత్ అంతా గట్టి కలెక్షన్స్ రాబడతాయి. అందుకే విజయ్కి తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన హీరోగా వచ్చిన చివరి సినిమా మాస్టర్ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు విజయ్ నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నాడు.

మొదటి స్ట్రైట్ సినిమా
మహర్షి సినిమా తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండి మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి వారి డేట్స్ కోసం అనేక రోజులు ఎదురు చూసిన వంశీ పైడిపల్లి రాసుకున్న కథలో విజయ్ హీరోగా కనిపించబోతున్నాడు. తెలుగులో విజయ్కి మొదటి స్ట్రైట్ సినిమా అయిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

నేషనల్ క్రష్
ఇక తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి జాతీయ అవార్డు పొందిన నిర్మాత దిల్ రాజు & శిరీష్ తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో విజయ్ సరసన కథానాయికగా నటించనున్నట్లు రష్మిక పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.

ఇలాంటి స్టోరీ వినలేదని
అంతేకాక సినిమాకు థమన్ సంగీతం అందిస్తాడని కూడా తాజాగా ప్రకటించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రంలో విజయ్ని మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి వంశీ పైడిపల్లి పవర్ ఫుల్ స్క్రిప్ట్ను రెడీ చేశారు. ఈ కథ విన్న విజయ్.. గత 20 ఏళ్లలో ఇలాంటి స్టోరీ వినలేదని అన్నాడు అని దిల్ రాజు ఆ మధ్య వెల్లడించారు. ఇక ఈ దీపావళికి ఈ సినిమాను రెడీ చేసి విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడట.

పూజా కార్యక్రమాలతో
అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం ఉదయం చెన్నైలో మొదలైంది. ఈ పూజా కార్యక్రమంలో విజయ్, రష్మిక మందన్న, థమన్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి పాల్గొన్నారు. ఇక విజయ్ లేటెస్ట్ మూవీ బీస్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది.. ఏప్రిల్ 13న భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.


Click it and Unblock the Notifications











