సల్మాన్ కేసులో సాక్ష్యం చెప్పి బిచ్చమెత్తుకునే స్థితికి...(కన్నీటి గాథ)
హైదరాబాద్: మద్యం మత్తులో వాహనం నడిపి ఒకరి మరణానికి, నలుగురు గాయ పడటానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో 13 ఏళ్ల విచారణ అనంతరం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఐదేళ్ల జైలు శిక్షకు గురయ్యాడంటే...అందుకు ప్రధాన కారణం ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పోలీసు కానిస్టేబుల్ రవీంద్ర పాటిల్ కోర్టు ముందు సాక్ష్యం చెప్పడమే.
సల్మాన్ ఖాన్ మద్యం మత్తులో వాహనం నడిపాడని రవీంద్ర పాటిల్ చెప్పిన సాక్ష్యమే ఈ రోజు కోర్టు తీర్పులో కీలకం అయింది. రవీంద్ర పాటిల్ ప్రస్తుతం ప్రాణాలతో లేక పోయినా....అతని సాక్ష్యం మాత్రం బ్రతికే ఉంది. సల్మాన్ ఖాన్ ను వెంటాడి జైలు శిక్ష పడేలా చేసింది. విషాదం ఏమిటంటే....ఈ కేసులో సాక్ష్యం చెప్పిన తర్వాత రవీంద్రపాటిల్ జీవితం చిద్రమైంది. చివరకు రోడ్డు మీద బిచ్చమొత్తుకునే స్థితికి చేరాడు. క్షయ వ్యాధితో 2007లో కన్నుమూసాడు. రవీంద్ర పాటిల్ జీవితం ఎందుకలా తయారైందనే విషయాలను ఓసారి గుర్తు చేసుకుందాం.
ముంబైలోని సతారాకు చెందిన 25 ఏళ్ల రవీంద్రపాటిల్ చిన్నతనం నుండి పోలీసు కావాలని కలలుకన్నాడు. కష్టపడి ముంబై పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. అతని చురుకుదనం చూసి స్పెషల్ ఆపరేషన్ స్వ్కాడ్(ఎస్ఓఎస్)లో శిక్షణకు పంపారు డిపార్టెమెంటు వారు. సల్మాన్ కు ముంబై అండర్ వరల్డ్ నుండి బెదిరింపులు రావడంతో అతనికి బాడీగార్డుగా వెళ్లాడు రవీంద్ర పాటిల్.

2002, సెప్టెంబర్ 28న సల్మాన్ ఖాన్ తన సోదరుడు సొహైల్ ఖాన్, సింగర్ కమాల్ ఖాన్, మరికొందరు మిత్రులతో కలిసి బాంద్రా హిల్ రోడ్డులోని జేడబ్ల్యు మారియట్ హోటల్ కు వెళ్లారు. అందులోని రెయిన్ బార్ లో పీకల్లోతు తాగారు. అనంతరం రాత్రి రెండు గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న సల్మాన్ ఖాన్ ను రవీంద్ర పాటిల్ కారు నడపొద్దంటూ వారించాడు. అయినా సల్మాన్ వినిపించుకోలేదు. తానే స్వయంగా తన ల్యాండ్ క్రూయిజర్ కారుకు నడుపుకుంటూ మితిమీరిన వేగంతో వెళ్లారు. కారు అదుపు తప్పడంతో బాంద్రారోడ్డులోని అమెరికన్ ఎక్స్ ప్రెస్ బేకరీలోకి కారు దూసుకెళ్లింది. బేకరీ ముందు పడుకున్న వారిలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. బాడీగార్డు కావడంతో ఆ సమయంలో రవీంద్ర పాటిల్ కారులోనే ఉన్నారు.
యాక్సిడెంట్ అనంతరం కారు అక్కడే వదిలేసి సల్మాన్ ఖాన్, ఇతరులు అక్కడి నుండి వెళ్లి పోయారు. ఈ సంఘటన అనంతరం రవీంద్ర పాటిల్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయమై పోలీసులకు పిర్యాదు చేసాడు. ఎఫ్ఐఆర్ లో ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. ఈ కేసులో సాక్ష్యం చెప్పిన తర్వాత రవీంద్ర పాటిల్ జీవితం తారుమారైంది.
బడాబాబులు ఇన్వాల్వ్ అయిన కేసులో సాక్షిగా ఉండటంతో ఎస్ఓఎస్ విభాగం నుండి పాటిల్ ను తప్పించారు. సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంతో పోలీసు శాఖ నుండి కూడా అతనికి తీవ్రమైన ఒత్తిళ్లు, వేధింపులు మొదలయ్యాయని అతని సన్నిహితులు చెబుతుంటారు. ఎంతో ఇష్టంగా, కష్టపడి ఈ ఉద్యోగం సంపాదించిన రవీంద్ర పాటిల్...పోలీసు శాఖలో పరిస్థితి మానసికంగా కృంగి పోయాడు. అప్పటి నుండి విధులకు కూడా సరిగా హాజరయ్యేవాడు కాదు. మానసికంగా కృంగిపోయి ముంబైకి దూరంగా వెళ్లిపోయాడు. సల్మాన్ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. సాక్షిగా కోర్టుకు హాజరు కాక పోవడంతో న్యాయమూర్తి అతనిపై అరెస్టు వారెంటు జారీ చేసారు. 2006లో మహా భలేశ్వర్ లో అతన్ని అరెస్టు చేసి ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. కొన్ని నెలల తర్వాత జైలు నుండి విడుదలయిన పాటిల్ కు క్షయ వ్యాధి సోకింది. మళ్లీ అతను కనిపించకుండా పోయాడు. 2007లో ముంబైలోని శివిడీ రోడ్డులో బిచ్చమెత్తుకుంటూ కనిపించాడు. బిచ్చమొత్తుకుని కొంత డబ్బు సంపాదించుకుని సెవ్రీలోని టీబీ ఆసుపత్రికి చేరాడు. పోలీసు శాఖలో చేరినపుడు కండలు తిరిగి బలిష్టంగా ఉన్న రవీంద్ర పాటిల్ ఆ వ్యాధి మూలంగా చిక్క శల్యమై 30 కిలోల అస్తిపంజరంగా మారాడు. వ్యాధి ముదరడంతో 2007 అక్టోబర్ 4న మరణించాడు.
కేసు విచారణ సందర్భంగా సల్మాన్ ఖాన్....కారు నేను నడపలేదు, తన డ్రైవర్ అశోక్ సింగ్ నడిపాడనే వాదన తెరపైకి తెచ్చాడు. అయితే కోర్టు సల్మాన్ వాదన నమ్మలేదు. కోర్టు సల్మాన్ వాదన నమ్మక పోవడానికి ప్రధాన కారణం రవీంద్ర పాటిల్ సాక్షమే. ఒక వేళ రవీంద్రపాటిల్ సల్మాన్ కేసు విషయంలో వాంగ్మూలం మరోలా చెప్పి ఉంటే అతని జీవితం ఇంకెలా ఉండేదో...??


Click it and Unblock the Notifications











